కమిషనర్‌ చొరవతో మహిళకు విముక్తి

13 Jun, 2017 01:30 IST|Sakshi
వాట్సాప్‌ సందేశంతో రియాద్‌లోని మహిళకు విముక్తి
 
వరంగల్‌: వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ జి.సుధీర్‌బాబు చొరవతో ఏపీలోని కడప జిల్లా మాదారం సిద్దోట మండలానికి చెందిన ఓ మహిళకు రియాద్‌లో పడుతున్న చిత్రహింసల నుంచి విముక్తి లభించింది. మాదారం సిద్దోట మండలం లక్ష్మీపురానికి చెందిన పేరూరు సుబ్బలక్ష్మి రియాద్‌లో తనను చిత్రహింసలు పెడుతున్నారని.. రక్షించాలని వాట్సప్‌లో పంపిన వీడియోను చూసి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు స్పందించారు. వెంటనే డీసీపీ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి 4 రోజుల్లోనే ఆమెను వరంగల్‌కు తీసుకువచ్చారు. సోమవారం వరంగల్‌ లో ఈ కేసు విషయాలను సీపీ వివరించారు.

సుబ్బలక్ష్మి ఉపాధి కోసం దుబాయికి వెళ్లేందుకు ఏజెంట్లు జిలానీ, వెంకటేశ్, వలీలను సంప్రదించి రూ.80 వేలు అందజేసింది. వారు ఆమెను దుబాయికి కాకుండా రియాద్‌ దేశంలోని అబ్ధుల్లా షేక్‌కు రూ.2 లక్షలకు అమ్మేశారు. అక్కడ సుబ్బలక్ష్మి కొన్నాళ్లకు అనారోగ్యానికి గురైంది. షేక్‌ ఆమెకు చికిత్స చేయించకుండా ఓ గదిలో బంధించి  హింసకు గురిచేశాడు.  ఆ దృశ్యాలను ఆమె తన తమ్ముడదికి వాట్సప్‌లో పంపింది.  ఈ నెల 7న సీపీ సుధీర్‌బాబు నంబరుకు ఆమె బంధువులు ఆ వీడియోను పంపడంతో  అప్రమత్తమై డీసీపీ ఇస్మాయిల్‌ నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సుబ్బలక్ష్మి యాజమాని అబ్ధుల్లా షేక్‌తో ఏజెంట్‌ ద్వారా సంప్రదింపులు జరిపించడంతో పాటు అతనికి ఇవ్వాల్సిన రూ.2 లక్షలను కూడా ఏజెంటుతోనే ఇప్పించారు. ఆమెను అక్కడినుంచి రప్పించి ఆమె భర్త పెంచలయ్యకు  సోమవారం అప్పగించారు.  
మరిన్ని వార్తలు