మేడారం జాతరపై అధికారులను కోరిన కడియం శ్రీహరి
సాక్షి, హైదరాబాద్: మేడారంలో వచ్చే ఏడాది జనవరి 31న జరగనున్న సమ్మక్క, సారలమ్మ జాతర దృష్ట్యా భక్తులు ఇబ్బందులు పడకుండా హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కోరారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ, రహదారుల శాఖ, ఆర్ అండ్ బీ అధికారులు, ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులతో కడియం శ్రీహరి సమావేశమయ్యారు.
ఆయన మాట్లాడుతూ...ఈ జాతరకు దాదాపు కోటిమందికిపైగా భక్తులు వస్తారని, ఇందులో రోడ్లు అత్యంత ప్రాధాన్యమైనందున వాటిని పూర్తిస్థాయిలో బాగు చేయాలని కోరారు. సమావేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ అధికారి కృష్ణ ప్రసాద్, జాతీయ రహదారుల శాఖ చీఫ్ ఇంజనీర్ గణపతి రెడ్డి, ఎస్.ఈ రాజిరెడ్డి, ఈఈ హఫీజ్, ఎల్ అండ్ టీ ప్రతినిధులు హాజరయ్యారు.