ఈ నిర్మాణాలు అద్భుతం..

14 Dec, 2018 01:09 IST|Sakshi

సాగర్‌ను సందర్శించిన  బౌద్ధమత ప్రతినిధులు 

వివిధ దేశాలనుంచి వచ్చిన  215 మంది బృందం 

బుద్ధవనంలోని నిర్మాణాల పరిశీలన

నాగార్జునసాగర్‌: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని ప్రముఖ బౌద్ధక్షేత్రమైన నాగార్జునకొండను గురువారం పలు దేశాలకు చెందిన బౌద్ధమత ప్రతినిధులు, గురువులు సందర్శించారు. వీరికి మిర్యాలగూడ ఆర్డీఓ జగన్నాథరావు, టూరిజం విభాగం జీఎం జోయెల్, జిల్లా పర్యాటకశాఖ అధికారి శివాజీలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. బుద్ధవనం ప్రత్యేకా«ధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ఆహ్వానం మేరకు బౌద్ధమత సంబంధ దేశాల గురువులు సాగర్‌ జలాశయతీరంలో 275 ఎకరాలలో నిర్మాణాలు జరుగుతున్న శ్రీపర్వతారామంలోని బుద్ధవనాన్ని సందర్శించేందుకు వచ్చారు. బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్న 215 మంది తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ఆరు బస్సులు, ఇతర వాహనాల్లో నాగార్జునసాగర్‌కు చేరుకున్నారు. వీరు హిల్‌కాలనీలో బుద్ధవనంలోని మహాస్థూపం, జాతకకథల పార్కులు, ప్రపంచంలోని వివిధ బౌద్ధ క్షేత్రాల్లో వెలుగు చూసిన స్థూపాల నమూనాలను ఆసక్తితో తిలకించారు.

విజయవిహార్‌లో అధికారులు తెలంగాణలోని బౌద్ధ ప్రాంతాల చరిత్రను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వారికి వివరించారు. అనంతరం హిల్‌కాలనీలోని లాంచీస్టేషన్‌ నుంచి ప్రత్యేక లాంచీలలో నాగార్జునకొండకు చేరుకున్నారు. అక్కడి మ్యూజియంలోని బుద్ధుడి జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలు, సింహళవిహార్, అశ్వమేధ యాగశాలను తిలకించారు. దలైలామా నాటిన బోధివృక్షం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆర్కియాలజి విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్‌ సుశాంత్‌కుమార్, మరో అధికారి సత్యనారాయణలు గైడ్‌గా వ్యవహరించారు. కొండను సందర్శించిన బౌద్ధ ప్రతినిధుల బృందంలో తైవాన్‌కు చెందిన బౌద్ధమత గురువు షిషిన్‌టింగ్‌తోపాటు తైవాన్‌కు చెందిన 129 మంది, మలేషియాకు చెందిన 27 మంది, హాంగ్‌కాంగ్‌కు చెందిన 43 మంది, అమెరికా కు చెందిన ముగ్గురు, ఇండోనేషియా, థాయిలాండ్, ఇంగ్లండ్, సింగపూర్, చైనాతోపాటు మన దేశానికి చెందిన ఒక్కొక్కరు చొప్పున బౌద్ధ ప్రతినిధులు పాల్గొన్నారు. వీరి వెంట నాగార్జునకొండ మ్యూ జియం క్యూరేటర్‌ సాయికృష్ణ, రాష్ట్ర పర్యాటకశాఖ అధికారులు, నాగార్జునసాగర్‌ సీఐ వేణుగోపాల్, సాగర్, పెద్దవూర ఎస్‌ఐలు సీనయ్య, రాజు ఉన్నారు. 

అద్భుత నిర్మాణాలు.. 
ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలు అద్భుతంగా ఉన్నాయని, అంతా పూర్తయితే ప్రపంచంలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రాలన్నీ సందర్శించినట్లుగా ఉంటుందని మలేషియాకు చెందిన బౌద్ధ ప్రతినిధి పేర్కొన్నారు. కాగా, ఇక్కడ తమ దేశానికి చెందిన సంస్థ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోందని, తైవాన్‌ ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే ఒకసారి మతగురువులు వచ్చి స్థల పరిశీలన చేశారని వెల్లడించారు.  

బుద్ధవనంలో పరిశోధన కేంద్రం 
శ్రీపర్వతారామంలోని బుద్ధవనంలో పరి శోధన కేంద్రం ఏర్పాటుకు తైవాన్‌ సంస్థ ముం దుకు వచ్చినట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. సాగర్‌లోని శ్రీపర్వతారామంలో ఆరా మాలు, యూనివర్సిటీ, అధ్యయన కేంద్రాల ఏర్పాటుకు వివిధ సంస్థలను ఆహ్వానించేందుకు గతేడాది బౌద్ధమతాన్ని ఆచరించే పలు దేశాలకు బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య వెళ్లి వచ్చారు. అక్కడ పలు సంస్థలను కలసి బుద్ధవనం ప్రాజెక్టు గురించి వివరించారు. ఈ ఏడాది మొదట్లో తైవాన్‌కు చెందిన ఓ సంస్థ ప్రతినిధులు వచ్చి పరిశోధన కేంద్రం ఏర్పాటుకుస్థల పరిశీలన చేసి వెళ్లారు. ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు ఇప్పుడు మరోమారు సందర్శనకు వ చ్చినట్లు పర్యాటక సంస్థ అధికారులు తెలిపారు.  

>
మరిన్ని వార్తలు