గుంజీలు తీయించిన టీచర్‌

21 Nov, 2017 02:02 IST|Sakshi

అనారోగ్యానికి గురైన గురుకుల విద్యార్థినులు

ఆదిలాబాద్‌ రూరల్‌: ఓ విద్యార్థినికి చెందిన నోట్‌ బుక్స్‌ ఎవరు చింపారని ప్రశ్నించగా తెలియదని సమాధానం ఇచ్చిన విద్యార్థునులతో ఓ పీఈటీ టీచర్‌ గుంజీలు తీయించగా వారు అస్వస్థతకు గురయ్యారు. ఘటన ఆదిలాబాద్‌ జిల్లా మావల మండలం పిట్టలవాడలోని మైనార్టీ గురుకులంలో సోమవారం చోటుచేసుకుంది. మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో 6, 7వ తరగతి విద్యార్థులు ఓ విద్యార్థి నోట్‌బుక్స్‌ చింపివేశారు. ఎవరు చింపారని పీఈటీ రమాదేవి అడగ్గా.. తమకు తెలియదని చెప్పారు. దీంతో ఆమె 20 మందితో గుంజీలు తీయించారు. నలుగురు స్పృహ తప్పిపోయి పడిపోగా, వారిని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. 

హోంవర్క్‌ చేయలేదని... 
స్టేషన్‌ ఘన్‌పూర్‌: హోంవర్క్‌ చేయలేదని  ఓ టీచర్‌ నలుగురు విద్యార్థులను చితకబాదిన ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మహాత్మా జ్యోతిబాపూలే ప్రభుత్వ బీసీ బాలుర గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. హోంవర్క్‌ చేయలేదని నవీన్‌ అనే టీచర్‌ ఏడో తరగతి విద్యార్థులు భాస్కుల ప్రేమ్, అనుముల సాయికిరణ్, బి.నితిన్, సందీప్‌లను తొడలపై వాతలు వచ్చేలా చితకబాదాడు. తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో నవీన్‌పై చర్యలు తీసుకుం టామని ఎస్‌ఓ మల్లయ్య చెప్పారు.

మరిన్ని వార్తలు