పరిషత్‌ తొలి భేటీకి నిబంధనలు సవరించాలి

26 May, 2019 06:00 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్‌ఈసీ విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: పరిషత్‌ ఎన్నికల ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించిన వెంటనే జిల్లా ప్రజాపరిషత్‌ (జెడ్పీపీ), మండల ప్రజాపరిషత్‌ (ఎంపీపీ)ల మొదటి సమావేశాన్ని నిర్వహించేందుకు వీలుగా ప్రస్తుతమున్న నిబంధనలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరి నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) తెలిపింది. ఈ నిబంధనలు సవరించడం ద్వారా పరిషత్‌ ఫలితాలు వెలువడ్డాక ఎక్కువ ఆలస్యం లేకుండా ఎన్నికైన సభ్యులు పరోక్ష పద్ధతుల్లో జెడ్పీపీ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకునే వీలుంటుందని ఎస్‌ఈసీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన అందగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు తేదీని ఎస్‌ఈసీ ప్రకటిస్తుందన్నారు. సోమవారం జరగాల్సిన పరిషత్‌ ఓట్ల లెక్కింపును వాయిదా వేసిన నేపథ్యంలో మళ్లీ కౌంటింగ్‌ నిర్వహించే తేదీని ఎస్‌ఈసీ ప్రకటించాల్సి ఉంది.   

మరిన్ని వార్తలు