-
ఏపీ ప్రభుత్వానికి ఆప్కాబ్ స్టాఫ్ యూనియన్, ఎంప్లాయిస్ అసోసియేషన్ వినతి
సాక్షి, హైదరాబాద్: ఆప్కాబ్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచొద్దంటూ ఆ బ్యాంక్ స్టాఫ్ యూనియన్, ఎంప్లాయిస్ అసోసియేషన్లు ప్రభుత్వానికి విన్నవించాయి. విభజన నేపథ్యంలో ఆప్కాబ్కు హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో రెండు బ్రాంచ్లు, 235 మంది ఉద్యోగులను కేటాయించారని పేర్కొన్నాయి. ఇప్పటికే 55 మంది ఉద్యోగులు అధికంగా ఉన్నారని.. పదవీ విరమణ వయసును పెంచితే త్వరలో రిటైర్ అయ్యే 35 మంది ఉద్యోగులను కలుపుకుంటే 90 మంది ఉద్యోగులు అధికంగా ఉన్నట్లు అవుతుందని ప్రభుత్వానికి వివరించాయి.
ఇది బ్యాంకుకు ఆర్థిక భారంగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. తెలంగాణ ప్రభుత్వం ఏఎస్సీఏబీ, తొమ్మిది డీసీసీబీల్లో 750 మంది ఉద్యోగులను నియమించడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నాయి. పదవీ విరమణ వయసును పెంచకపోతే ఆప్కాబ్, డీసీసీబీల పరిధిలో ఖాళీగా ఉన్న 800 ఉద్యోగాలను భర్తీ చేయవచ్చని సూచించాయి. ఈ మేరకు ఆ బ్యాంక్ యూనియన్ నేతలు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు వినతి పత్రం అందజేశారు.