‘అమ్మవారు..కమ్మ వారు ఎన్నికలప్పుడే గుర్తొస్తారు’ 

28 Jun, 2018 02:13 IST|Sakshi
కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు ఎన్నికలు, ఉప ఎన్నికలు వస్తున్నాయంటే కొండమీద అమ్మవారు, కొండకింద కమ్మవారు గుర్తుకొస్తారని కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం సచివాలయం మీడియా పాయింట్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లుగా గుర్తుకురాని విజయవాడ కనకదుర్గమ్మకు ముక్కుపుడక ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చినట్లని ప్రశ్నించారు. ముక్కుపుడక సమర్పించుకోవాలనుకుంటే జూబ్లీహిల్స్‌లో పెద్దమ్మ తల్లి, బల్కంపేటలో ఎల్లమ్మ తల్లి, ఊరూరా పోచమ్మ తల్లులు ఉన్నారని అన్నారు. కేసీఆర్‌ విజయవాడకు వెళ్లేది అమ్మవారి మీద భక్తితో కాదని అక్కడి కమ్మ వారిని ప్రసన్నం చేసుకుని ఇక్కడ ఓట్లు రాల్చుకోవడానికేనని ఆరోపించారు. కొడంగల్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సచివాలయంలో పలువురు అధికారులను కలసి ఆయన వినతిపత్రం సమర్పించారు. 

మరిన్ని వార్తలు