రాజకీయాల్లో కాక  

29 Oct, 2017 10:39 IST|Sakshi

టీడీపీకి గుడ్‌బై చెప్పిన రేవంత్‌రెడ్డి

స్పీకర్‌ ఫార్మాట్‌లో ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా 

కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అవుతున్న ‘ఎనుముల’ 

 సందిగ్ధంలో ఉమ్మడి పాలమూరు 

టీడీపీ కేడర్‌.. కాంగ్రెస్‌లో జోష్‌ 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సీఎం కేసీఆర్‌పై మాటల తూటాలు పేలుస్తూ, ఫైర్‌ బ్రాండ్‌గా పేరొందిన రేవంత్‌రెడ్డి టీడీపీతో పాటు ఎమ్మెల్యే పదవికి గుడ్‌బై చెప్పేశారు. దీంతో కొంతకాలంగా నెలకొన్న చర్చలకు పుల్‌స్టాఫ్‌ పెట్టినట్లయింది. ఇక ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగా తన మార్గాన్ని సుగమం చేసుకున్నారని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే పార్టీతో పాటు ఆ పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా  చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా ఏకకాలంలో రెం డు బాణాలు సంధించిన రేవంత్‌ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు ఆయన సొంత జిల్లా పాల మూరులో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక ఆయన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఆమోదిస్తారా, ఉపఎన్నిక వస్తే పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. రేవంత్‌ వెంట కాంగ్రెస్‌లోకి ఎవరెవరు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.   

టీడీపీకి గుడ్‌బై 
పదేళ్ల పాటు తెలుగుదేశంలో కొనసాగుతూ.. తెలంగాణలో టీడీపీకి దిక్సూచిగా వ్యవహరిస్తున్న రేవంత్‌పార్టీని వీడడంతో కేడర్‌ అయోమయంలో పడినట్లయింది. రేవంత్‌ చరిష్మా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఉమ్మడి జిల్లాలోనే ఆయనకు ఫాలోవర్లు ఏర్పడ్డారు. అధికార టీఆర్‌ఎస్‌ ఎన్ని ప్రలోభాలు పెట్టినా అలాంటి వారు టీడీపీని వీడలేదు. 2014 ఎన్నికల సందర్భంగా కూడా రేవంత్‌ను ఓడించడానికి టీఆర్‌ఎస్‌ శతవిధాల ప్రయత్నించినట్లు చెబుతారు. అయితే బలమైన తెలంగాణ సెంటిమెంట్‌ను తట్టుకుని కొడంగల్‌ నియోజకవర్గం నుంచి ఆయన 15వేల మెజార్టీతో గెలుపొందడమే కాకుండా తన పక్క నియోజకవర్గం నారాయణపేట నుంచి అభ్యర్థిని గెలిపించుకున్నారనేది టాక్‌. ప్రస్తుతం ఆయన రాజీనామాతో తమను నడిపించే నాయకుడు ఎవరనే అంశమై కేడర్‌ సతమతమవుతోంది. కాగా, రేవంత్‌తో పాటు ఒకరిద్దరు సీనియర్లు మినహా రెండో స్థాయినేతలు మొత్తం పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.   

కాక పుట్టిస్తున్న అస్త్రం 
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ రాజకీయ పునరేకీకరణ చేపట్టారు. అందుకు అనుగుణంగా ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గ స్థాయి నేతలతో పాటు చోటామోటా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరారు. అదే విధంగా మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, నారాయణపేట నుంచి ఎస్‌.రాజేందర్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పుకున్నారు. వాస్తవానికి వీరు గెలుపొందిన పార్టీని కాదని ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండానే టీఆర్‌ఎస్‌కు జైకొట్టారు. ప్రస్తుతం టీడీపీని వీడుతున్న సందర్భంగా రేవంత్‌ తన పదవికి సైతం రాజీనామా చేయడంతో.. కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన రామ్మోహన్‌రెడ్డి, టీడీపీ నుంచి గెలుపొందిన రాజేందర్‌రెడ్డి పార్టీ ఫిరా యింపుల అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లయింది. ఒకవేళ రేవంత్‌ రాజీనామా ఆమోదం పొందితే వీరిద్దరి అంశాన్ని ఎలా పరిగణనలోకి తీసుకుంటారో అనేది వేచిచూడాలి. కాగా, ఆదివారం కొడంగల్‌లో తన అనుచరులతో రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు.

కాంగ్రెస్‌లో నూతనోత్సాహం
రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు దీటుగా మా ట్లాడగలిగే నేతగా పేరొందిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతుండడంతో ఆ పార్టీ క్యాడర్‌లో నూతనోత్సాహం నెలకొంది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన కేడర్‌ ఉంది. 2014లో సాధారణ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద గులాబీ హవా కొనసాగినా పాలమూరు ప్రాం తంలో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ ధీటుగా బదులిచ్చింది. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంట్‌ స్థానాలు ఉన్నాయి. వీటిలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఒక పార్లమెంట్‌తో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగలిగింది. అదే స్థాయిలో కాంగ్రెస్‌ కూడా ఒక పార్లమెం ట్‌ స్థానంతో పాటు ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రంలో మొత్తం మీద ఏ జిల్లాలో కూడా కాంగ్రెస్‌కు ఇతంటి మెరుగైన ఫలితాలు వచ్చిన దాఖలాలు లేవు. ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్‌ పార్టీ టెంపో తగ్గకుండా చూడడంలో మాజీ మంత్రి డీకే అరుణ సక్సెస్‌ అయ్యారు. తాజాగా రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరుతుండడంతో కేడర్‌లో జోష్‌ పెరగనుంది.  

మిడ్జిల్‌ నుంచి రాజకీయ ఓనమాలు 
రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేవంత్‌రెడ్డి స్వస్థలం ఉమ్మడి జిల్లాలోని వం గూరు మండలం కొండారెడ్డిపల్లి స్వగ్రామం. అయితే రేవంత్‌ రాజకీయ రంగప్రవేశం మాత్రం మిడ్జి ల్‌ నుంచి ప్రారంభించారు. 2004 లో జెడ్పీటీసీ ఎన్నికల్లో మి డ్జిల్‌ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీకి దిగిన ఆయన భారీ మెజార్టీతో గెలుపొందారు. అక్కడి నుంచి వెనుతిరిగి చూడకుండా ముందుకు సాగుతున్నారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసి సునాయాసంగా గెలుపొందాక టీడీపీలో చేరారు. ఆ తర్వాత కొడంగల్‌ ని యోజకవర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో నుంచి గెలుపొం దారు. 2014లో తెలంగాణ సెంటి మెంట్‌ బలంగా ఉండి, టీఆర్‌ఎస్‌ హవా కొనసాగినా రేవంత్‌కు 15 వేల మెజార్టీ సాధించడాన్ని పలు వురు ప్రస్తావిస్తారు. ఇలా ఇప్పటి వరకు నాలుగుసార్లు పోటీ చేసిన ఎన్నికల అన్నింటిలో కూడా రేవంత్‌ విజయం సాధించారు. 

మరిన్ని వార్తలు