రేవంత్‌కు సీపీఐ మద్దతు 

18 Mar, 2019 03:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మల్కాజ్‌గిరి పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తోన్న టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సీపీఐ మద్ధతిచ్చేందుకు అంగీకరించింది. ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి తదితరులతో రేవంత్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తనకు మద్ధతివ్వాలని వారిని రేవంత్‌ కోరారు. సమావేశం అనంతరం తాము మల్కాజిగిరిలో రేవంత్‌రెడ్డికి మద్ధతిస్తున్నట్లు సీపీఐ ప్రకటించింది. 

లౌకిక శక్తులకు మద్దతు: చాడ  
‘పార్లమెంట్‌ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వమని రేవంత్‌ కోరారు. మాల్కాజ్‌ గిరి లోని సీపీఐ నేతలందరూ రేవంత్‌ గెలుపు కోసం కృషి చేస్తారు. బీజేపీ హఠావో దేశ్‌ బచావో అని పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా లౌకిక శక్తులకు మద్దతిస్తున్నాం. డిఫీట్‌ బీజేపీ, డిఫీట్‌ టీఆర్‌ఎస్‌ అనే నినాదంతో ముందుకెళతాం’అని సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు. 

కేసీఆర్‌ అరాచకాలపై పోరు.. 
‘కేసీఆర్‌ అరాచకత్వంపై పోరాడటానికి సీపీఐ మద్దతు అడిగాను. మాల్కాజ్‌గిరిలో ఆ పార్టీ ప్రభావం ఉంటుంది. వారి మద్ధతుంటే తప్పకుండా గెలుస్తా. అరాచకత్వానికి మోదీ, కేసీఆర్‌ బొమ్మ– బొరుసుల్లాంటి వారు. బీజేపీ చేసిన పనులన్నింటికి కేసీఆర్‌ మద్ధతిచ్చి ఇప్పుడు ప్రజల ముందు నాటకాలు ఆడుతున్నారు. ఢిల్లీలో మోదీని, ఇక్కడ కేసీఆర్‌ను నిలువరించాలంటే కమ్యూనిస్టుల సహకారం అవసరం. కేసీఆర్‌కు వేసిన ప్రతీఓటు మోదీకి వేసినట్టే. సినిమాలో గచ్చిబౌలి దివాకర్‌ పాత్ర లాగా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ ఓ జోకర్‌’. అని భేటీ అనంతరం చాడ, రేవంత్‌లు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు