వరి కోతలు షురూ..

10 Oct, 2018 12:47 IST|Sakshi

సాక్షి,  మెదక్‌జోన్‌ :  జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది సరైన వర్షాలు లేక  భూగర్భ జలాలు   అడుగంటిపోయాయి. ఫలితంగా  పంటలు సగం మేర ఎండిపోయాయి. గతేడాదితో పోల్చుకుంటే దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉంది. చేతికందిన కొద్దిపాటి ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారోనని  రైతులు ఎదురుచూస్తున్నారు.  ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా సాధారణ వరిపంట సాగు 38,068  హెక్టార్లుకాగా   వర్షాబావ పరిస్థితుల కారణంగా 36,165 హెక్టార్ల మేర పంటలను సాగు చేశారు.   సకాలంలో వర్షాలు కురవకపోవడంతో 40శాతం పంటలు ఎండిపోయియి.

మిగిలిన 60 శాతం పంట ద్వారా కేవలం 95వేల క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చేఅవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సాధారణ వరి సాగు 36,165 హెక్టార్లుకాగా  42,150 హెక్టార్లలో సాగు చేశారు.   పంటలు సంవృద్ధిగా పండాయి. దీంతో 1.60 లక్షల మెట్రిక్‌టన్నుల దిగుబడి వచ్చింది. ఈలెక్కన గతేడాదితో పోల్చితే 65వేల మెట్రిక్‌టన్నుల దిగుబడి తక్కువగా వచ్చే పరిస్థితి నెలకొంది. వేలాది రైపాయల అప్పులు  చేసిపంటలను  సాగుచేస్తె  నీటితడులు అందక పంటలు ఎండిపోయి అప్పులుగా మిగిలాయి.  అడపాదడప పండిన పంటలను  సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తేనే రైతుకు కాస్త ఊరట లభిస్తోంది. లేనిచో దళారులను ఆశ్రయించి మరింత నష్టపోయే పరిస్థితి ఉంది.

మక్కలు దళారులపాలు...
జిల్లాలో ఇప్పటికే 80శాతం మక్క పంట రైతులకు చేతికందింది.  కానీ  ప్రభుత్వం ఇప్పటి వరకు  కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు  చేయక పోవటంతో  మధ్యదళారులను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోయారు.  ప్రభుత్వం క్వింటాల్‌ రూ. 1700 ప్రకటించగా దళారులు రూ.1,400 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. మక్కల  విక్రయాలు ప్రారంభమై 20 రోజులు కావస్తోంది. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఆదుకోవల్సిన అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోనూ జాప్యం జరిగితే  వరి రైతులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. కొనుగోలు కేంద్రాలను అధికారులు వెంటనే ప్రారంభించి రైతులను ఆదుకోవాలని వారు కోరతున్నారు.

20 వ తేదీన ప్రారంభిస్తాం..

అఈ విషయంపై డీసీఓ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను   20వ తేదీ నంచి  ప్రారంభిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 190 సెంటర్లను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు.  గతేడాది 170 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 1.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.  రూ. 453 కోట్లను పంపిణీ చేశాం. చేయటం జరిగింది. ఈయేడు ఖరీఫ్‌లో మరో 20 అధనంగా కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నామన్నారు.

గతేడాదితో పోల్చితే దిగుబడి భారీగా తగ్గే పరిస్థితి జిల్లాలో ఉందన్నారు.  అలాగే ఈనెల 10 నుంచి మక్క కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. మక్కలు తక్కువగా ఉన్నందున 6 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.  మెదక్, రామాయంపేట, చేగుంట, నర్సాపూర్, శివ్వంపేట, వెల్దుర్తి మండలాల్లో ఏర్పాటు చేస్తామాన్నరు. అవసరాన్ని బట్టి మరో రెండు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు