ఇంటికో ఉద్యోగం కాదు..ఊరికో ఉద్యోగం కూడా రాలే

27 Jun, 2020 03:56 IST|Sakshi
బీసీ భవన్‌లో నిరాహార దీక్ష చేస్తున్న ఆర్‌. కృష్ణయ్య. చిత్రంలో చాడ వెంకట్‌రెడ్డి, కోదండరాం తదితరులు

బీసీ భవన్‌లో ఆర్‌.కృష్ణయ్య దీక్ష

మద్దతు తెలిపిన పలు ప్రతిపక్ష పార్టీలు, బీసీ సంఘాల నేతలు

సాక్షి, ముషీరాబాద్‌ (హైదరాబాద్‌): తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఇంటికొక ఉద్యోగం అంటూ ఊరూ వాడా ప్రచారం చేసి తీరా అధికారంలోకి వచ్చి ఆరేళ్లు గడుస్తున్నా ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వలేదని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, 16 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో నిరాహార దీక్షలు చేపట్టారు.

రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ నీలం వెంకటేశ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలను కృష్ణయ్య పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ దీక్షలకు మద్దతుగా వివిధ ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు ప్రొఫెసర్‌ కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, గొరిగ మల్లేశ్, సి.రాజేందర్‌లు పాల్గొని ప్రసంగించారు.

మరిన్ని వార్తలు