వేగమే తొలి శత్రువు!

30 Aug, 2018 02:39 IST|Sakshi
హరికృష్ణ భౌతికకాయాన్ని అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్న కళ్యాణ్‌రామ్, కొడాలి నాని, జూనియర్‌ ఎన్టీఆర్‌

మితిమీరిన వేగంతోనే రోడ్డు ప్రమాదాలు 

తర్వాతి స్థానాల్లో డ్రంకన్‌ డ్రైవ్, నిర్లక్ష్యం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర పరిధిలో ఉన్న రహదార్లపై రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా రోడ్డు విస్తరణలు జరుగుతున్నా.. మితిమీరిన వేగం ప్రమాదాలకు ముఖ్యకారణం అవుతోంది. తర్వాతి స్థానాల్లో డ్రంకెన్‌ డ్రైవ్, నిర్లక్ష్యంగా ఉండటం గమనార్హం. మనదేశంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఏ వాహనానికైనా గరిష్ట వేగ పరిమితి 80 కి.మీ. మాత్రమే. కానీ ఇక్కడ కార్లు, ఇతర వాహనాలు 120 కిలోమీటర్లు దాటి కూడా వెళుతున్నాయి. రోడ్డు రవాణా, హైవే శాఖ 2016 నివేదిక ప్రకారం ఏటా దేశవ్యాప్తంగా 4,80,652 ప్రమాదాలు జరుగుతుండగా 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మితిమీరిన వేగం కారణంగానే 68 శాతం ప్రమా దాలు జరగడం గమనార్హం. తెలంగాణలో దాదాపు 5 వేలకు పైగా మరణాలు జరిగాయి. 

కాగితాల్లోనే రోడ్‌ సేఫ్టీ కమిటీ! 
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్‌ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేయాలని ఏడాది కింద ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మెడికల్, రవాణా, పోలీసు, ఆర్‌ అండ్‌ బీ అధికారులు భాగస్వామ్యం కావాలి. అయితే ఇదింకా తుదిరూపు దాల్చలేదు. దీనికి ఎవరు నేతృత్వం వహించాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

నిరంతర నిఘా అవసరం 
మితిమీరిన వేగం, డ్రంకెన్‌ డ్రైవ్, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనల నియంత్రణకు రహదారులపై నిరంతర డ్రైవ్‌లు చేపట్టాలి. కెమెరాలతో పర్యవేక్షణ అవసరం. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు భారీగా జరిమానాలు విధించాలి. 
– పాండురంగ్‌ నాయక్, జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్,ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం  

మరిన్ని వార్తలు