సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో ఇటీవల కాలంలో రహదారులపై జరిగిన ప్రమాదాలు బీతి గొల్పుతున్నాయి. ప్రమాదాల్లో పలువురు మృతి చెందుతుండగా అనేక మంది క్షతగాత్రులవుతున్నారు. ప్రధానంగా ప్రమాదాలకు మానవ తప్పిదాలకు తోడు రోడ్ల పరిస్థితులు కూడా కారణమవుతున్నాయన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. జిల్లాలో జాతీయ రహదారి కాకుండా అనేక పంచాయతీరాజ్, ఆర్అండ్బి రోడ్లు ఉన్నాయి. వీటిలో కొన్ని అంతర్రాష్ట్ర రహదారులు కూడా వస్తాయి. గుడిహత్నూర్ నుంచి ఉట్నూర్ వైపు వెళ్లే రహదారిపై అతివేగం కారణంగా ఇటీవల అనేక ప్రమాదాలు సంభవించాయి. ప్రమాదాలకు కారణాలను అన్వేషించి నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రోడ్ సేఫ్టీ కమిటీ
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్ సేఫ్టీ కమిటీ ఉంది. దీనికి కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఎస్పీ వైస్ చైర్మన్గా, జిల్లా రవాణ అధికారి కన్వీనర్గా ఉన్నారు. డీపీఈవో, డీఎంహెచ్వో, ఆర్అండ్బి ఈఈ, పంచాయతీరాజ్ ఈఈ, 108 (ఈఎంఆర్ఐ), రిమ్స్ సూపరింటెండెంట్, డీఈవో, విద్యుత్ శాఖ ఎస్ఈ తదితరులు ఉన్నారు. ప్రమాదాల పరిస్థితిని బట్టి వీరు చర్చించి నివారణకు చర్యలు తీసుకుంటారు. అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే వాటిని ఈ కమిటీ ఇదివరకు గుర్తించింది. అక్కడ ప్రమాదాలకు కారణాలను అన్వేషించి దానికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేశారు. పూర్తిస్థాయిలో చర్యలు చేపడితే ప్రమాదాలు నివారించవచ్చనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
⇔ జనవరి 31న బజార్హత్నూర్ మండలం చందునాయక్తండాకు చెందిన అజిడే ఆకాష్ తన మిత్రుడు పడ్వాల్ అనిల్ (17)తో కలిసి గుడిహత్నూర్ నుంచి ఉట్నూర్ వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు బైక్ను అతివేగంగా ఢీకొట్టి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పడ్వాల్ అనిల్ మృతిచెందగా, ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి.
⇔ ఫిబ్రవరి 24న ఇంద్రవెల్లికి సమీపంలో ఈశ్వర్నగర్ పెట్రోల్బంక్ వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో బైక్పైనున్న దంపతులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
⇔ మార్చి 4 బుధవారం తాంసి మండలం పొన్నారి అంతర్రాష్ట్ర రహదారి హనుమాన్ మందిరం వద్ద లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తితో పాటు తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందడం కలకలం కలిగిస్తోంది.
కమిటీ గుర్తించిన ప్రదేశాలు
గుడిహత్నూర్ మండలం జున్ని వద్ద ఆకస్మిక మలుపుతో పాటు రోడ్డు పల్లంగా ఉండటం ప్రమాదాలకు కారణమవుతోంది. ఇక్కడ రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడం ద్వారా వేగాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు
రోడ్లపై ప్రయాణించేటప్పుడు లిప్తపాటు నిర్లక్ష్యంతో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ దృష్ట్యా ప్రయాణ మార్గంలో నిర్లక్ష్యం తగదు. జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరిగే స్పాట్స్ను ఇదివరకే గుర్తించాం. అక్కడ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. – పుప్పాల శ్రీనివాస్, డీటీసీ, ఆదిలాబాద్