దారి దోపిడీ ముఠా అరెస్ట్

4 Sep, 2015 01:01 IST|Sakshi

 ఉప్పల్ : దారి దోపిడీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను ఉప్పల్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ఓ బాలుడు కూడా ఉండటం విశేషం.  మల్కాజిగిరి ఏసీపీ రవిచందన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా చింతగట్టు గ్రామానికి చెందిన గుండ్లపల్లి శ్రావణ్‌కుమార్(21) మెకానిక్. ప్రకాశం జిల్లా కాసినేనిపల్లి గ్రామానికి చెందిన కోనేటి మర్యాదాస్(20) సెంట్రింగ్ వర్కర్, నల్లగొండ జిల్లా తుర్కపల్లి పెద్ద తండాకు చెందిన బానోతు వినోద్‌కుమార్(21), కర్నూలు వెంకటగిరికి చెందిన బాలుడు (16) ముఠాగా ఏర్పడ్డారు. ఉప్పల్ దేవేందర్‌నగర్ కాలనీని అడ్డాగా చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్నారు.
 
 2013లో సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి, వారి వద్ద లాక్కొన్న ఏటీఎం కార్డు ద్వారా నగదు డ్రా చేసుకెళ్లారు. ఈ కేసులో కొందరిని రిమాండ్‌కు తరలించగా గుండ్లపల్లి శ్రావణ్‌కుమార్, మర్యాదాస్, వినోద్‌కుమార్ తప్పించుకు తిరుగుతున్నారు. వీరు ముగ్గురూ ఓ బాలుడిని వెంటపెట్టుకుని ఉప్పల్‌లోని దేవేందర్ నగర్ పరిసరాల్లో తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్న వారిని బెదిరించి అందినకాడికి దోచుకుంటున్నా రు. ఇదిలాఉండగా... ఉప్పల్ పోలీసులు బుధవారం దేవేందర్‌నగర్‌లో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అక్కడ అనుమానాస్పందగా తిరుగుతున్న శ్రావణ్‌కుమార్, మర్యాదాస్, వినోద్‌కుమార్‌తో పాటు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
 
 విచారణలో నిందితులు దారి దోపిడీలకు పాల్పడుతున్నట్టు వెల్లడించారు.  శ్రావణ్‌కుమార్‌పై మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగు, ఉప్పల్ పీఎస్ పరిధిలో ఒకటి, కోనేటి మర్యాదాస్‌పై మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు, ఉప్పల్ ఠాణా పరిధిలో ఒకటి, వినోద్‌కుమార్‌పై ఉప్పల్ ఠాణాలో ఒక కేసు, బాలుడిపై ఉప్పల్ పీఎస్‌లో రెండు, మార్కెట్ పీఎస్‌లో ఒక కేసు ఉన్నాయి.  నిందితుల నుంచి సెల్‌ఫోన్, గొలుసు, జనరేటర్ స్వాధీనం చేసుకున్నారు. బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించి, మిగతా ముగ్గురు నిందితులను గురువారం రిమాండ్‌కు తరలించారు.  సమావేశంలో ఉప్పల్ ఇన్‌స్పెక్టర్‌నర్సింహారెడ్డి, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఖాజా మోహినుద్దీన్, క్రైం ఎస్‌ఐ రవికుమార్ ఉన్నారు.
 

మరిన్ని వార్తలు