భారీ దోపిడీకి పథకం 21 కాలనీల్లో రెక్కీ
బైక్ దొంగల అరెస్ట్తో కదిలిన డొంక
ఆరుగురు నిందితుల రిమాండ్
గ్రామాల్లో రైతులకు చోరీ బైక్ల విక్రయం
55బైక్లు, తల్వార్, కత్తి, డమ్మీ పిస్తోళ్లు స్వాధీనం
రియల్ ఎస్టేట్ కార్యాలయం దహనం కేసులోనూ వీడిన మిస్టరీ
నేరేడ్మెట్: ‘‘ప్రముఖులు, వ్యాపారులు, ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్న 21 కాలనీలను టార్గెట్ చేసుకుని రెక్కీలు నిర్వహించారు. రాత్రిపూట ఇళ్లలోకి చొరబడి తల్వార్, కత్తితోపాటు డమ్మీ పిస్టోళ్లతో బెదిరించి దోపిడీలకు పథకం పన్నారు. మరో 48 గంటల్లో ఈ పథకాన్ని అమలు చేయాలనుకున్న క్రమంలో రాచకొండ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. దీనితో పాటు మూడేళ్ల క్రితం రామంతపూర్ ప్రాంతంలో జరిగిన రియల్ ఎస్టేట్ కార్యాలయం దహనం కేసులోనూ మిస్టరీ వీడింది. రెండు కేసుల్లోనూ ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, 55 బైక్లతోపాటు ఒక తల్వార్, కత్తి, రెండు డమ్మీ పిస్తోళ్లు, రూ.29.7లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నేరేడ్మెట్లోని తన కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్భగవత్ వివరాలు వెల్లడించారు.
జల్సాల కోసం బైక్ చోరీలు...
భువనగిరి జిల్లా, ఆత్మకూర్కు చెందిన మర్రినాగరాజు అబ్లుల్లాపూర్మెంట్లోని అన్నారం గ్రామంలో ఉంటూ రామోజీ ఫిల్మ్సిటీ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఉప్పల్ పీఅండ్టీ కాలనీలో ఉంటున్న కడప జిల్లా, స్నోకవరం గ్రామానికి చెందిన అల్లూరి విజయ్ కూడా అక్కడే సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. కాగా కొన్ని రోజుల క్రితం నాగరాజు హిమాయత్నగర్ పరిధిలో జరిగిన చోరీ కేసులో అరెస్టై జైలుకు వెళ్లివచ్చాడు. ఇద్దరికీ ఫిల్మ్సిటీలోనే పరిచయం ఏర్పడటంతో ఇద్దరూ కలిసి వనస్థలిపురం, మీర్పేట్, అబ్దుల్లాపూర్మ్మెట్, ఎల్బీ నగర్, చైతన్యపురి కాలనీ, సరూర్నగర్, ఉప్పల్, మేడిపల్లి, మలక్పేట్, అంబర్పేట్, కాచిగూడ, చిలుకలగూడ ఠాణాల పరిధిలో 55 బైక్ల చోరీలకు పాల్పడ్డాడు. సదరు బైక్ల నంబర్లు మార్చి, నంబర్ లేకుండా ఆత్మకూర్, మోత్కూర్, మర్రిగూడ, రామన్నపేట్ గ్రామాల్లో రైతులకు తక్కువ ధరకు విక్రయించేవారు. వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.
లూటీ పథకం బయటపడిందిలా...
వనస్థలిపురం ఠాణా పరిధిలోని బీఎన్ రెడ్డినగర్లో ఆదివారం అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గత మూడేళ్లుగా రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లోని బైక్ చోరీలకు పాల్పడుతున్న పాతనేరస్తులు మర్రి నాగరాజు అలియాస్ రాజు, అల్లూరి విజయ్ అలియాస్ బాచిగా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా పలు నేరాలతో పాటు భారీ దోపిడీ పథకం వెలుగులోకి వచ్చింది.
రెక్కీ చేసిన కాలనీలివే...
ప్రశాంతిహిల్స్, ప్రశాంతినగర్, బ్యాంక్ కాలనీ, విష్ణునగర్, సత్యానగర్(హయత్నగర్), అలకాపురి, నాగోల్, బండ్లగూడ, జైపూర్ కాలనీ ( ఎల్బీనగర్), గాయత్రినగర్, నందిహిల్స్ (మీర్పేట్), భరత్నగర్, స్వరూప్నగర్, బాలాజీ నగర్, గాంధీనగర్, బీరప్పగడ్డ, పద్మావతికాలనీ, రామంతాపూర్, చిలుకానగర్, గణేష్నగర్, వెంకట్రెడ్డినగర్, కల్యాణ్పురి(ఉప్పల్), బోడుప్పల్ (మేడిపల్లి) ప్రాంతాల్లో వారు రెక్కీలు నిర్వహించినట్లు గుర్తించారు.
29 బైక్ చోరీ కేసులు...
కాగా కమిషనరేట్ పరిధిలో 29 బైక్ల చోరీ కేసులు నమోదు కాగా, వాటిలో 21 బైక్ల వివరాలు తెలిశాయని, ఇంజన్ మార్చడం, యజమానుల చిరునామాలు మారడం వల్ల మిగతా బైక్ల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ చోరీ బైక్లపై ఆరా తీయనున్నట్లు సీపీ పేర్కొన్నారు.
వీడిన మిస్టరీ...
బైక్ చోరీల విచారణలో 2016 ఆగస్టులో రామంతాపూర్లో భాగ్యశ్రీ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కార్యాలయం దహనం కేసులో మిస్టరీ విడింది. సదరు కార్యాలయ యజమాని చిత్తరంజన్రెడ్డి అలియాస్ కేసీ.రెడ్డి వ్యాపారంలో నష్టాలు రావడంతో వాటినుంచి గట్టెక్కేందుకు తన డ్రైవర్ శివకృష్ణ ద్వారా ఎన్జీఆర్ఐలో హౌస్కీపింగ్ కాంట్రాక్టర్గా పని చేస్తున్న మహేష్ను కలిశాడు. ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరిస్తూ తన కార్యాలయాన్ని దగ్ధం చేస్తే ఒక్కొక్కరికి రూ.40వేల నగదు, 100 చ.గజాల స్థలం ఇస్తానని తెలిపాడు. ఇందుకు ఒప్పందం కుదరడంతో రూ.10వేలు అడ్వాన్స్గా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో మహేష్, మర్రినాగరాజు, విజయ్, మద్ధం రాజుతో కలిసి కార్యాలయంలో ఫర్నీచర్పై పెట్రోల్పోసి నిప్పంటించి, చిత్తరంజన్రెడ్డి భూమి రిజిస్ట్రేషన్ చేయనందుకు అతడిని చంపేస్తామని కేకలు వేస్తూ అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం ఒప్పందం ప్రకారం చిత్తరంజన్రెడ్డి వారికి మిగతా సొమ్మును చెల్లించడమేగాక, స్థలాన్ని వారి బంధువుల పేరున రిజిస్ట్రేషన్ చేయించాడు. అనంతరం చిత్తరంజన్రెడ్డి దశరథ్, శంకర్నాయక్లపై అనుమానం వ్యక్తం చేస్తూ ఉప్పల్ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు. గ్యాంగ్స్టర్ నయీం అనుచరులే ఈ పని చేశారని ప్రచారం చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో కేసును మూసివేశారు. బైక్ దొంగల అరెస్టుతో ఈ కేసులో మిస్టరీ వీడింది.
రాష్ట్రంలోనే రికార్డు..
రాష్ట్రంలో మూడేళ్ల క్రితం 47 చోరీ బైక్ల రికవరీ రికార్డును రాచకొండ పోలీసులు బ్రేక్ చేశారు. తాజాగా 55 బైక్లను రికవరీ చేయడం ద్వారా రికార్డు సృష్టించారు. సమావేశంలో క్రైం ఇన్చార్జి డీసీపీ నారాయణరెడ్డి, అడిషనల్ డీపీపీ శ్రీనివాస్, సీఐలు అశోక్కుమార్, ప్రవీణ్బాబు, రాములు, డీఐ జగన్నాథ్, ఎస్ఐలు మైసొద్దీన్, నాగార్జున, వెంకటస్వామి, ఏఏస్, హెచ్సీ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. నిందితులు మర్రినాగరాజు, అల్లూరి విజయ్, మద్ధంరాజు, మహేష్, చిత్తరంజన్రెడ్డి, శివకృష్ణలను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. బైక్ల చోరీ విచారణలో కీలక పాత్ర పోషించిన హెడ్కానిస్టేబుల్ రాములును సీపీ ప్రత్యేకంగా అభినందిస్తూ నగదు పురస్కారాన్ని అందజేశారు.