మాజీ డీజీపీ బంధువు ఇంట్లో భారీ చోరీ

8 Jul, 2015 09:20 IST|Sakshi

హైదరాబాద్:హైదరాబాద్: మాజీ డీజీపీ దినేష్ రెడ్డి బంధువు ఇంట్లో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది.  జూబ్లీహిల్స్ లోని ఆయన సోదరుడి కుమార్తె ఇంట్లో సుమారు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలతో పాటు పలు విలువైన వస్తువులు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

జూబ్లీహిల్స్ రోడ్ నెం-58 లో ఉండే దినేష్ రెడ్డి సోదరుడి కుమార్తె దివ్యారెడ్డి గతనెల 4 న అమెరికా వెళ్లింది. వెళ్లు ముందు వజ్రపు ఉంగరాలు, గాజులు దుస్తుల మధ్యలో ఉంచి, వాటిని ఒక బ్యాగ్ లో పెట్టి తన తల్లి వద్దకు పంపింది. అయితే దుస్తుల్లో నగలు పెట్టిన విషయాన్ని తల్లికి చెప్పడం మరిచిపోయింది. గత నెల 17 న దివ్యారెడ్డి అమెరికా నుంచి తిరిగి రావడంతో  తల్లి తన వద్ద ఉన్న బ్యాగులో మరికొన్ని దుస్తులు పెట్టి తిరిగి పంపింది.

అయితే అప్పటి నుంచి దివ్యారెడ్డి బ్యాగ్ లోని నగలను చూసుకోలేదు. కాగా గత నెల 30 న బ్యాగ్ లో చూసుకోగా నగలు కనిపించలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా దివ్యారెడ్డి నివాసంలో ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు నిందితుల ఆచూకీ కనిపెట్టడం కష్టతరంగా మారింది.

మరిన్ని వార్తలు