39 ఏళ్లా.. 44 ఏళ్లా?

4 Sep, 2018 02:04 IST|Sakshi

‘పంచాయతీ కార్యదర్శి’ వయోపరిమితిపై అయోమయం

గరిష్ట వయోపరిమితిగా 39 ఏళ్లు ఖరారు చేస్తూ నోటిఫికేషన్‌

 టీఎస్‌పీఎస్సీ నియామకాల్లో గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు

 రిజర్వేషన్‌ కోటా సడలింపు అదనం.. నోటిఫికేషన్‌పై అభ్యర్థుల ఆందోళన 

వయోపరిమితి నిబంధన జీవో 190కి విరుద్ధమంటున్న అభ్యర్థులు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌లో వయోపరిమితిపై అయోమయం నెలకొంది. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 39గా నిర్ధారించడంతో మెజార్టీ అభ్యర్థులకు దరఖాస్తు చేసే అంశంపై స్పష్టత కొరవడింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా చేపడుతున్న ఉద్యోగాల భర్తీకి సం బంధించి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లుగా పేర్కొంటూ నోటిఫికేషన్లు ఇచ్చింది. వయోపరిమితిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తూ జీవో 190ని గతేడాది జూలై 8న జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో అప్పటివరకున్న గరిష్ట వయోపరిమితిగా ఉన్న 34 సంవత్సరాలు కాస్తా 44 సంవత్సరాలుగా మారింది. ఈ ఉత్తర్వులు 26 జూన్, 2019 వరకు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు నియామకాల భర్తీలో గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలుగా ఉంది. కానీ, గత వారం ప్రభుత్వం విడుదల చేసిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 39 సంవత్సరాలుగా పేర్కొంటూ నోటిఫికేషన్‌ జారీ చేయడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. 

9,355 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 
రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శి ఉండాలనే ఉద్దేశంతో ప్రస్తుతమున్న ఖాళీలన్నీ భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆగస్టు 31న 9,355 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల కు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఉద్యోగాల సంఖ్య భారీగా ఉండటంతో నిరుద్యోగుల్లో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో ఉద్యోగం కోసం పోటీ పడుతున్నవారి సంఖ్య తీవ్రమైంది. ఈ నోటిఫికేషన్‌పై దాదాపు రెండు నెలలుగా ప్రచారం జరుగుతుండటంతో కొందరు ముందస్తుగా శిక్షణ(కోచింగ్‌) సైతం పొందుతున్నారు. తాజాగా వెలువడిన ప్రకటనలో గరిష్ట వయోపరిమితి 39 సంవత్సరాలు మాత్రమేనని పేర్కొనడంతో వారిలో నైరాశ్యం నెలకొంది. ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి గరిష్ట వయోపరిమితిని 44 సంవత్సరాలుగా ప్రకటించాలని నిరుద్యోగ వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

మహిళలకు 3,158 పోస్టులు 
ప్రభుత్వం భర్తీ చేయనున్న 9,355 జూనియర్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల్లో మహిళలకు మూడో వంతు చొప్పున 3,158 రిజర్వ్‌ చేశారు. మిగతా 6,197 పోస్టులను జనరల్‌ కేటగిరీలోకి చేర్చారు. పోస్టుల భర్తీకి సంబంధించి గత నెల 31న నోటిఫికేషన్‌ జారీ చేసిన పంచాయతీరాజ్‌ శాఖ రెండ్రోజుల క్రితం జిల్లాలవారీగా పోస్టుల వివరాలు, మార్గదర్శకాలను విడుదల చేసింది. పూర్తి వివరాలను పంచాయతీరాజ్‌ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ నెల 3 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 11లోపు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్‌ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.400 చొప్పున ఫీజు చెల్లించాలి. 

జిల్లాల వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. 
జిల్లా                          జనరల్‌     మహిళలు     మొత్తం 
ఆదిలాబాద్‌                    221         114         335 
భద్రాద్రి                          257         130         387 
జగిత్యాల                       191          97         288 
జనగాం                         137          69         206 
భూపాలపల్లి                   201         103         304 
జోగులాంబ                    106           55         161 
కామారెడ్డి                      289         147         436 
కరీంనగర్‌                       151         78         229 
ఖమ్మం                         323         162         485 
కొమురంభీం                    155         80         235 
మహబూబాబాద్‌              245         125         370 
మహబూబ్‌నగర్‌              340         171         511 
మంచిర్యాల                      153         79         232 
మెదక్‌                           230         116         346 
మేడ్చల్‌                            15         12         27 
నాగర్‌కర్నూల్‌                  205         105         311 
నల్లగొండ                        439         222         661 
నిర్మల్‌                           211         111         322 
నిజామాబాద్‌                 269         136         405 
పెద్దపల్లి                        130         64         194 
రాజన్న సిరిసిల్ల             118         59         177 
రంగారెడ్డి                      237         120         357 
సంగారెడ్డి                     297         149         446 
సిద్దిపేట                       223         115         338 
సూర్యాపేట                  227         115         342 
వికారాబాద్‌                 285         144         429 
వనపర్తి                     104           55         159 
వరంగల్‌రూరల్‌           183          93         276 
వరంగల్‌ అర్బన్‌           52           27         79 
యాదాద్రి                  203         104         307

మరిన్ని వార్తలు