రౌడీషీటర్లపై ‘నయా’ నిఘా

10 May, 2019 08:15 IST|Sakshi
రౌడీ షీటర్స్‌ మాడ్యూల్‌ను ఆవిష్కరిస్తున్న సీపీ అంజనీకుమార్, అదనపు సీపీ శికా గోయల్‌ తదితరులు

సాక్షి, సిటీబ్యూరో: ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న నగర పోలీసులు రౌడీషీటర్ల కదలికలపై సరికొత్త పర్యవేక్షణ వ్యవస్థను గురువారం అందుబాటులోకి తీసుకొచ్చారు. టీఎస్‌కాప్‌ అప్లికేషన్‌లో చేర్చిన ‘రౌడీ షీటర్స్‌ మాడ్యూల్‌’ బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో  నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ప్రారంభించారు. ఠాణాల వారీగా రౌడీషీటర్ల పేర్లతో కూడిన డేటాను ప్రతి పోలీసు అధికారికి అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఫీల్డ్‌ ఆఫీసర్లు తమ యూజర్‌నేమ్‌తో లాగిపై రౌడీ షీటర్ల డాటాను తనిఖీ చేయవచ్చని, వారి ఫొటో లు కూడా అందుబాటులో ఉండటంతో ఏ సందర్భంలోనైనా గుర్తించే అవకాశం ఉందన్నారు. వారి నేరచరిత్ర పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటు ందని తెలిపారు. ఈ రౌడీషీటర్స్‌ మాడ్యూల్‌ వల్ల పెట్రోల్‌ కార్లు, బ్లూకోల్ట్స్‌ వారు ఉంటున్న చిరునామాలకు వెళ్లడంతో పాటు వారి కదలికలపై నిఘా ఉంచి వారి జియో–టాగ్‌ లోకేషన్‌ మ్యాప్‌లో పొందుపరచవచ్చన్నారు. జోన్‌లు, పోలీసు స్టేషన్ల వారీగా నివేదికలు పొందుపరిచిన టీఎస్‌కాప్‌ డ్యాష్‌బోర్డును సీనియర్‌ పోలీసులు పర్యవేక్షించవచ్చని సీపీ పేర్కొన్నారు. 

కంప్యూటర్లు, ప్రింటర్ల పంపిణీ...
నగర పోలీసు కమిషనరేట్‌ వ్యాప్తంగా ఈ–గవర్నెన్స్‌ అమలు చేస్తుండటంతో పోలీసు స్టేషన్‌లకు కంప్యూటర్లు, ప్రింటర్లను సీపీ అంజనీకుమార్‌ ఆయా అధికారులకు పంపిణీ చేశారు. ఆయా విభాగ సిబ్బంది ప్రతిపాదనల మేరకు 157 కంప్యూటర్లు, 35 ప్రింటర్లను అందజేశారు. ఈ 157 కంప్యూటర్లలో లా అండ్‌ అర్డర్‌ పోలీసు స్టేషన్లకు 65, ఏసీపీలకు 14, మెయిన్‌ పీసీఆర్‌కు 10 కంప్యూటర్లు అందించారు. మిగిలిన కంప్యూటర్లను ట్రాఫిక్, సిటీ సెక్యూరిటీ వింగ్, కార్‌ హెడ్‌క్వార్టర్స్, సీసీఎస్, స్పెషల్‌ బ్రాంచ్‌లకు అందించారు. కార్యక్రమంలో క్రైమ్స్‌ అండ్‌ సిట్‌ అడిషనల్‌ సీపీ శికా గోయల్, లా అండ్‌ అర్డర్‌ అడిషనల్‌ సీపీ డీఎస్‌ చౌహన్, ఎస్‌బీ జాయింట్‌ సీపీ తరుణ్‌ జోషి, అన్ని జోన్ల డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు