పంచాయతీ నిధులు రూ.1.26 కోట్లు స్వాహా

23 Nov, 2014 02:26 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గ్రామానికి ప్రథమ పౌరులు సర్పంచులు. అయితే, నిధుల దుర్వినియోగంతో కొందరు తమ పేరుకు మచ్చ తెచ్చుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు నేపథ్యంలో నిధుల విని యోగంలో చేతివాటం చూపిస్తున్నారు. పలువురు సర్పంచులు పనులు చేయకుండానే రూ.3.23 కోట్లు కాజేశారు.

 2006 నుంచి 2013 వరకు అనే క పద్దుల కింద గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల య్యాయి. వీటితోపాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల (బీఆర్‌జీఎఫ్)ను ఇష్టారాజ్యంగా వాడుకున్న సర్పంచులపై నేటికీ చర్యలు లేవు. పదవి నుంచి వైదొలగిన 165 మంది మాజీ సర్పంచుల వద్దే రూ.1,25,54,516 ఉన్నాయి. 2013 జూన్‌లో జరిగిన ఎన్నికలలో కొత్త సర్పంచులు అధికారం చేపట్టారు. ఇందులో కొందరు గత సర్పంచులనే ఆదర్శంగా తీసుకుంటున్నారు.

 ఇదీ సంగతి
 నిధుల దుర్వినియోగంలో జిల్లావ్యాప్తంగా 17 మంది సర్పంచులపై ఆరోపణలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు వెనుకబడిన ప్రాం తాల అభివృ ద్ధి నిధుల(బీఆర్‌జీఎఫ్)ను విడుదల చేసింది. జడ్‌పీ, ఎంపీ, జీపీ సెక్టార్‌ల కింద రూ.106.50 కోట్లు విడుదల కాగా, ఇందులో గ్రామ పంచాయతీ సెక్టారు కింద సుమా రుగా రూ. 53 కోట్ల వరకు ఉన్నాయి.

ఏడాదికి రూ.21.54 కోట్ల వరకు బీఆర్‌జీ నిధులు విడుదల కాగా, జడ్‌పీ సెక్టార్‌కు 20 శాతం, మండల సెక్టార్‌కు 30 శాతం పోను గ్రామ పంచాయతీ సెక్టార్‌కు 50 శాతం కేటాయిస్తూ వచ్చా రు. ఏటా గ్రామాలలో అభివద్ధి పేరిట బీఆర్‌జీ నిధులను ముందస్తుగా డ్రా చేసిన ప్రజాప్రతినిధులు నిధుల వి నియోగానికి సంబంధించిన ఎంబీ(మేజర్‌మెంట్ బుక్)లు, యూసీ(యూటిలైజేషన్ సర్టిఫికెట్)లు సమర్పించడంలో విపరీతమైన జాప్యాన్ని ప్రదర్శించారు. ఈ వ్యవహా రంపై మూడేళ్ల తర్వాత ఆరా తీసిన అధికారులు అక్రమాలు జరిగినట్లు తేల్చారు.

కొంతమంది సర్పంచుల చెక్‌పవర్ రద్దు చేసి, ఇంకొందరిపై కేసులు పెట్టారు. 2012 డిసెంబర్ నాటికి మొత్తంగా రూ.3,23,16,550 దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. 2013 మేలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, బకాయి ఉంటే పోటీకి అనర్హు లని, ఆర్‌ఆర్ యాక్టు, క్రిమినల్ కేసులు పెడతామని ఇలా అనేక రకాల ప్రయత్నాలు చేసిన అధికారులు రూ.1.97 కోట్లు రికవరీ చేశారు. జూన్‌లో జరిగిన ఎన్నికలలో కొ త్త పాలకవర్గం ఎన్నిక కాగా, మాజీ సర్పంచులు 165 మంది మాత్రం రూ.1,25,54,516 తమవద్దే పెట్టుకున్నారు.


 హిట్ లిస్టులో 29 మంది మాజీలు
 రూ.1.26 కోట్ల బీఆర్‌జీఎఫ్ స్వాహాపై చర్యలు నోటీసులకే పరిమితం అవుతున్నాయి. జిల్లా పంచాయతీ అధికారి పలుమార్లు నోటీసులు జారీ చేసినా  క్షేత్రస్థాయి అధి కారులు కొందరు స్వాహారాయుళ్లకు అండగా ఉండటం చర్చనీయాంశం అవుతోంది.

వసూలు చేయగా మిగిలిన రూ.1.26 కోట్లలో 165 మంది మాజీ సర్పంచుల పేర్లు జాబితాలో ఉన్నాయి. ఇందులో రూ. లక్ష నుంచి రూ.6.54 లక్షలకు వరకు నిధులు మింగిన 29 మంది మాజీలను హిట్‌లిస్టులో చేర్చారు. పిట్లం, బిచ్కుంద, రెంజల్, మద్నూరు, సదాశివనగర్, దోమకొండ, మాచారెడ్డి, గాంధారి, లింగంపేట, నిజాంసాగర్, సిరికొండ, బాల్కొండ, బోధన్, నవీపేట, ధర్పల్లి, డిచ్‌పల్లి మండలాలకు చెంది న పలువురు ఉన్నారు.

 అధికారుల ఉదాసీనత
 ఇదిలా ఉండగా, గతంలో నిధుల స్వాహాకు పాల్పడిన కొందరు సర్పంచుల నుంచి నిధులు రికవరీ చేయకుండా అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారన్న విమర్శ లున్నాయి. కొత్తగా ఎన్నికైన కొందరు సర్పం చులు దీనిని అదునుగా తీసుకుని నిధులను దుర్వినియోగం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో 17 మం దిపై ఇటీవల ఆరోపణలు రాగా వాటిని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఆర్మూరు మండలం గోవింద్‌పేట సర్పంచ్ ప్రభాకర్‌కు మాత్రం షోకాజ్ నోటీసు జారీ చేశారు.

13వ ఆర్థిక సంఘం నిధులు, గ్రామ పంచాయతీ నిధులు మొత్తం రూ.3,48,337 దుర్వినియోగం అయినట్లు విచారణ జరిపిన ఆర్మూరు డీఎల్‌పీఓ నివేదిక సమర్పించారు. ఈ మేరకు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం డీపీఓ ఇటీవల సర్పంచుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీంతో సర్పంచులలో కలకలం బయలు దేరింది. ఏదేమై నా గతంలో స్వాహా అయిన నిధులను పూర్తిగా రికవరీ చేయడంతోపాటు, భవిష్యత్‌లోను ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూడాలని ప్రజలు ఉన్నతాధికారుల ను కోరుతున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా సర్కారు నిధులను దుర్వినియోగం చేస్తే రెవెన్యూ రికవరీ యాక్ట్ (ఆర్‌ఆర్ యాక్టు) ప్రయోగించాలని, లేదా క్రిమినల్ కేసు లు నమోదు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేసినా, క్రిందిస్థాయి సిబ్బంది ఎక్కడా పాటించిన దాఖలాలు లేవు.

మరిన్ని వార్తలు