‘పుష్కర’ రహదారులకు రూ.110 కోట్లు..

11 Dec, 2014 04:24 IST|Sakshi

వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి
 
ఖమ్మం జెడ్పీసెంటర్: గోదావరి పురష్కరాల నేపథ్యంలో భద్రాచలం పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణానికి రూ.110 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి కోరారు. గోదావరి పుష్కరాల నిర్వహణపై కలెక్టర్లతో రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ బి.వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి బుధవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 14న ప్రారంభం కానున్న పుష్కరాలకు భద్రాచలానికి కోటి మందికిపైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందన్నారు.

ప్రతి ఏడాది భద్రాచలం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోందని, అక్కడికి చేరుకునే వంతెన ఇవతల వైపు రద్దీని అదుపు చేసేందుకు బూర్గంపాడు-ఏటూరునాగారం మార్గాన్ని నాలుగు వరుసలుగా వెడల్పు చేయాల్సి ఉందని అన్నారు. అదనంగా స్నానపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. గత పుష్కరాలోల ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాకపోకలకు వేర్వురుగా రహదారుల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినట్లు వివరించారు.

ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు రూ.110 కోట్లలో రూ. 65 కోట్లు ఆర్‌అండ్‌బీ, రూ.45 కోట్లు పంచాయతీరాజ్ రహదారులకు ఖర్చు అవుతాయన్నారు. భద్రాచలం పినపాక నియోజకవర్గాల పరిధిలో 14 స్నానపు ఘట్టాలు నిర్మాణానికి రూ.34 కోట్లు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. పుష్కరాల పనుల పర్యవేక్షణకు ఒక ప్రత్యేకాధికారిని నియిమించాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో ఎస్పీ షానవాజ్ ఖాసిం, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సతీష్, దేవాదాయ ఏసీ రాజేంధర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు