న్యూ ఇయర్ వేడుకల టార్గెట్ రూ. 150 కోట్లు

28 Dec, 2014 01:44 IST|Sakshi
న్యూ ఇయర్ వేడుకల టార్గెట్ రూ. 150 కోట్లు

* కొత్త సంవత్సరం ద్వారా ఆదాయం సమకూర్చుకోవడంపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ దృష్టి
* జిల్లాల అధికారులకు కమిషనర్ అహ్మద్ నదీం నిర్దేశం
* నూతన సంవత్సర పార్టీలకు ‘ఈవెంట్ పర్మిట్’ తప్పనిసరి
* పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని నియంత్రించాలని ఆదేశం

 
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఆ శాఖకు రోజు వారీగా వచ్చే రాబడి కన్నా ఏకంగా ఐదు రెట్లు అధికంగా రాబట్టాలని భావిస్తోంది. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాల ద్వారా కనీసం రూ. 150 కోట్లు ఆదాయం పొందాలని అధికార యంత్రాంగం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు రూ. 30 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతాయి. అయితే డిసెంబర్ 31న సాగే విక్రయాలను దృష్టిలో ఉంచుకొని మద్యం వ్యాపారులు ఈ నెల 22వ తేదీ నుంచే స్టాక్‌ను భారీగా కొనుగోలు చేస్తున్నారు. 25, 26 తేదీల్లో సెలవు దినాలు రావడంతో శనివారం మద్యం కొనుగోళ్లు పెద్దఎత్తున సాగాయి. ఒక దశలో డిపోల్లో సర్వర్లు కూడా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.
 
ఆదివారం మళ్లీ సెలవుకావడంతో 29, 30 తేదీల్లో మద్యం డిపోలకు తాకిడి పెరిగే అవకాశముంది. ఈ మద్యం మొత్తం 31, 1వ తేదీల్లో ఖాళీ అవుతుందని అధికారుల అంచ నా. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలతో కనీసం రూ. 150 కోట్లు ఆర్జించాలని అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లతో ఎక్సైజ్ శాఖ కమిషనర్ అహ్మద్ నదీం శనివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో సూచించినట్లు సమాచారం. బ్రూవరేజ్ కార్పొరేషన్ అధికారులతో కూడా ఆ యన మాట్లాడి లిక్కర్ డిపోల్లో మద్యం స్టాక్ వి వరాలను తెలుసుకున్నారు. ఐఎంఎఫ్‌ఎల్ బ్రాండ్లు కొన్ని అందుబాటులో లేవంటూ వైన్‌షాపులు, బార్ల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, 30వ తేదీ వరకు భారీ ఎత్తున స్టాక్‌ను ఖాళీ చే యాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
 
రాజధానిపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో సాధారణ రోజుల్లో కూడా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే రాబడే ఎక్కువ. ఇక్కడ అధిక ధర పలికే ప్రీమియం బ్రాండ్ల మద్యం అమ్మకాలు ఎక్కువ. అలాగే స్టార్ హోటళ్లు, బార్లు, క్లబ్బులు, రిసార్టులు ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకల ద్వారా ఈ రెండు జిల్లాల్లో మద్యం విక్రయాల రూపంలో కనీసం రూ. 75 కోట్ల మేర వస్తుందని అధికారుల అంచనా. ఇక కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ భారీగానే మద్యం విక్రయాలు సాగుతాయని భావిస్తున్నారు.
 
అయితే... ప్రైవేటు వ్యక్తులు గ్రూపులుగా ఏర్పాటై చేసుకునే పార్టీలకు సంబంధించి ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లను అప్రమత్తం చేయాలని ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీం అధికారులకు సూచించారు. అనుమతి లేకుండా హోటళ్లు, లాడ్జీలు, రిసార్టుల్లో మద్యంతో వేడుకలు చేసుకోకుండా చూడాలని జిల్లాల డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. పట్టణాల నుంచి నగరాల వరకు రూ. 3 వేల నుంచి రూ. 6 వేల వరకు చెల్లించి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ద్వారా ‘ఈవెంట్ పర్మిట్’ పొందిన తరువాతే పార్టీలకు అనుమతివ్వాలన్నారు.
 
సరిహద్దులపై ప్రత్యేక నిఘా..
 నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిఘా పెంచినట్లు ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీం తెలిపారు. ఇప్పటి నుంచి సంక్రాంతి వరకు రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణా, కల్తీ మద్యాన్ని నిరోధించడంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు ఆయన చెప్పారు. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ద్వారా దేశీదారు మద్యం.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి సరిహద్దుల ద్వారా కర్ణాటక నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉందని... దీనిని అరికట్టేందుకు చర్యలు చేపట్టామని నదీం పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం తప్పనిసరిగా ఈవెంట్ పర్మిట్ తీసుకోవాలని, ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. నూతన సంవత్సర వేడుకల  సందర్భంగా ఎక్సైజ్ ఆదాయం పెరగడం సహజమేనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

>
మరిన్ని వార్తలు