ధాన్యం కొనుగోళ్లకు రూ.3 వేల కోట్ల అప్పు

4 Nov, 2016 03:19 IST|Sakshi
ధాన్యం కొనుగోళ్లకు రూ.3 వేల కోట్ల అప్పు

- బ్యాంకు రుణాలతో రైతులకు చెల్లింపులు
- డబ్బుల్లేక సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ తిప్పలు
- బకాయిలు ఇవ్వలేమంటూ చేతులెత్తేసిన ఆర్థిక శాఖ
 
 సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు సరిపడే నిధులు లేకపోవటంతో పౌర సరఫరాల సంస్థ తల్లడిల్లుతోంది. రెండేళ్లుగా తమకు రావాల్సిన బకాయిల విడుదల చేయాలని ప్రభుత్వానికి పౌర సరఫరాల శాఖ మొర పెట్టుకుంటున్నా డబ్బులిచ్చే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ చేతులెత్తేసింది. ఈ విభాగాలకు తానే ప్రాతినిథ్యం వహిస్తుండటంతో తాజా పరిణామాలన్నీ మంత్రి ఈటల రాజేందర్‌కు విషమ పరీక్షగా ఉన్నాయి. ఒకవైపు రైతుల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిల వంటి చెల్లింపులకు ఆర్థికశాఖ మల్లగుల్లాలు పడుతోంది. ధాన్యం కొనుగోళ్లకు అత్యవసరంగా రూ.3000 కోట్లు ఇవ్వాలనే సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చింది.

రెండు శాఖల అధికారులతో ఇటీవల ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ సమక్షంలో సమీక్ష నిర్వహించినా బకాయిలు, చెల్లింపుల వివాదం సమసిపోలేదు. ఈలోగా రాష్ట్రవ్యాప్తంగా 2136 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించే ప్రక్రియ మొదలైంది. దీంతో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించటం ప్రభుత్వానికి సవాలుగా మారింది. గత్యంతరం లేకపోవటంతో ధాన్యం కొనుగోళ్లకు సరిపడేన్ని నిధులను అప్పుగా తెచ్చుకోవాలనే నిర్ణయం జరి గింది. బ్యాంకుల నుంచి రూ.3000 కోట్లు అప్పు తీసుకునేందుకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చింది. దీంతో తక్షణ సంక్షోభానికి పరిష్కారం లభిం చినట్లయింది.

ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సబ్సిడీలకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన రూ.7500 కోట్ల మూలధనం రెండున్నరేళ్లలోనే హరించుకుపోయింది. రూ పాయికి కిలో బియ్యం, బియ్యం పంపిణీ సీలింగ్ ఎత్తివేయటం, కుటుంబాలకు మించి న కార్డులుండటం ఈ పరిస్థితికి దారి తీసింది. బియ్యం సబ్సిడీ చెల్లింపులకు 2015-16 బడ్జెట్‌లో రూ. 2500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం గత ఏడాది కేవలం రూ.వెయ్యి కోట్లు విడుదల చేసింది. మిగతా సొమ్ము మంజూరు చేయకుండా దాటవేసింది. అంతకుముందు ఏడాది 2014-15కు సంబంధించి దాదాపు రూ.700 కోట్లు బకాయి పడింది. రెండేళ్లకు సంబంధించి మొత్తం రూ.2200 కోట్లు పేరుకుపోయాయి. దీంతో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చిక్కుల్లో పడింది. వీటికి తోడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు, అకౌంట్ల వివరణలు కేంద్రానికి పంపించకపోవటం, పలు సాంకేతిక సమస్యలతో రూ.2500 కోట్ల లోటు తలెత్తింది. అందుకే ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు చేతిలో చిల్లిగవ్వ లేదని, కొనుగోలు కేంద్రాలకు డబ్బులిచ్చే పరిస్థితి లేదంటూ కార్పొరేషన్ అసలు విషయాన్ని మంత్రి ఎదుట వెళ్లబోసుకుంది.  
 
 సబ్సిడీ బియ్యంతోనే గండి
 సబ్సిడీ బియ్యమే కార్పొరేషన్ కొంపకు ముప్పు తెచ్చింది. కేంద్రం ఇచ్చే సబ్సిడీ సరిపోకపోవటం, అదనంగా సర్దుబాటు చేయాల్సిన సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం పెం డింగ్‌లో పెట్టడంతో ఖజానా ఖాళీ అయిం ది. కేంద్రం రాష్ట్రంలోని లబ్ధిదారుల్లో 1.91 కోట్ల మందికి మాత్రమే ఆహార సబ్సిడీ చెల్లిస్తుంది. ఒక్కో లబ్ధిదారుడికి 4కిలోల బియ్యం లెక్కగట్టి నిధులు కేటాయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 2 కిలోలు ఇస్తుండటంతో ప్రతి నెలా 1.8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతోంది. కేంద్రం కేవలం 1.12 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అందిస్తోంది.  మిగిలిం ది మిల్లర్ల ద్వారా  రాష్ట్ర సేకరణ విభాగం నుంచి కొనుగోలు చేస్తోంది. కిలోకు రూ.24 చొప్పున కొనుగోలు చేస్తున్న ఈ బియ్యాన్ని రూపాయికే పంపిణీ చేయటంతో భారం నెలనెలా తడిసిమోపెడవుతోంది. ఎప్పటికప్పుడు సబ్సిడీని విడుదల చేయాల్సిన సర్కారు పెండింగ్‌లో పెట్టడంతో కార్పొరేషన్ అప్పుల బాట పట్టింది.

మరిన్ని వార్తలు