రుణమాఫీ రూ.950 కోట్లు

25 Aug, 2014 23:39 IST|Sakshi

 తాండూరు రూరల్: జిల్లాలోని ఆయా బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.950 కోట్లు మాఫీ కానున్నాయని కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. సోమవారం తాండూరు మండల పరిషత్ కార్యాలయంలోని అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీతో జిల్లాలోని రెండు లక్షల మందికిపైగా రైతులు లబ్ధిపొందనున్నారని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో ఆయా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతుల వివరాలు సేకరిస్తున్నామన్నారు.

ఈ నెల 28, 29 తేదీల్లో వివరాలు తీసుకున్న అనంతరం 31న జిల్లాస్థాయి కమిటీలో సమావేశమై నివేదికపై చర్చిస్తామన్నారు. జిల్లాస్థాయి సమావేశం అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో రుణమాఫీ అయిన రైతుల పేర్లను ప్రకటిస్తామన్నారు. రుణాల మాఫీ ప్రక్రియ ముగిసిన తర్వాత వచ్చేనెల రెండో వారంలో రైతులకు కొత్త రుణాలు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలను వేగవంతంగా కంప్యూటరీకరణ చేస్తున్నామని చెప్పారు.

>
మరిన్ని వార్తలు