భాగ్యనగరిలో గణేశ్ ఉత్సవాలపై మోహన్ భాగవత్
గణేశ్ నిమజ్జనానికి హాజరైన హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ
సుల్తాన్బజార్/గన్ఫౌండ్రి: దేశంలోనే భాగ్యనగరంలో ఎంతో ఉత్సాహంగా సామూహిక గణేశ్ ఉత్సవాలు నిర్వహించడం హిందువుల ఐక్యతను తెలియజేస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్వసంచాలక్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వినాయక నిమజ్జన కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్రావు అధ్యక్షతన నగరంలోని మోజాంజాహి మార్కెట్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సభ వేదిక నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులను ఉద్దేశించి భాగవత్ ప్రసంగించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. దేశంలోకెల్లా నగరంలోనే ఘనంగా గణేశ్ ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.