త్వరలో అమిత్‌ షాతో భేటీ : ఆర్టీసీ జేఏసీ

2 Nov, 2019 15:13 IST|Sakshi

సమ్మెను మరింత ఉధృతంగా చేస్తాం

భవిష్యత్తు కార్యచరణ ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఆ‍ర్టీసీ జేఏసీ కన్వీనర్‌ ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. విద్యానగర్‌లోని ఎంప్లాయిస్‌ యూనియన్‌లో ఆర్టీసీ జేఏసీ, విపక్ష నేతలతో శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం ముగిసిన అనంతరం అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలువనున్నట్లు తెలిపారు. కార్మికులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి గురించి ఆయనతో చర్చిస్తామని వెల్లడించారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో కలిసి ఈనెల 4 లేదా 5వ తేదీలలో అమిత్‌ షాతో భేటీ అవుతున్నట్లు తెలిపారు. అలాగే ఆర్టీసీ విభజనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న అది చెల్లుబాటు కాదని అన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు. రూట్లను వేరుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అలాగే ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు.

భవిష్యత్తు కార్యచరణ ప్రకటన.. 

  • 3న అన్ని డిపోల వద్ద, గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం
  • 4న రాజకీయ పార్టీలతో డిపోల దగ్గర దీక్ష
  • 5న సడక్ బంద్ రహదారుల దిగ్బంధం
  • 6న రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ముందు నిరసన
  • 7న ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులు, రాజకీయ పార్టీలతో డిపోల ముందు దీక్ష
  • 8న ఛలో ట్యాంక్ బండ్ సన్నాహక కార్యక్రమాలు
  • 9న ట్యాంక్ బండ్ పై దీక్ష, నిరసన కార్యక్రమాలు
మరిన్ని వార్తలు