కి.మీ.కు రూ.20 వరకు నష్టం
క్రమం తప్పకుండా చెడిపోతున్న విడిభాగాలు
నాసిరకం బస్సులు కావడంతో తీవ్ర సమస్యలు
సాక్షి, హైదరాబాద్ : ప్రతి రెండున్నర కిలోమీటర్లకు లీటర్ డీజిల్ తాగుతున్నాయి ఆ బస్సులు.. లాభాల సంగతి దేవుడెరుగు!! ప్రతి కిలోమీటరుకు దాదాపు రూ.20 వరకు నష్టం మిగులుతోంది. ఆ బస్సులు ఎన్ని కిలోమీటర్లు తిరిగితే ఆర్టీసీ ఖజానా అంతగా ఖాళీ అవుతోంది. వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్టుగా మింగేస్తూ గుదిబండగా మారాయి. ఎట్టకేలకు కళ్లు తెరచిన ఆర్టీసీ యాజమాన్యం ఆ కేటగిరీలోని ఏసీ బస్సులను ఉపసంహరించాలని నిర్ణయించింది. కానీ అదే కేటగిరీలోని నాన్ ఏసీ బస్సులను మాత్రం కొనసాగించనుంది. వాటిని కనిష్టంగా 10 లక్షల కిలోమీటర్ల మేర తిప్పుతామంటూ తొలుత తీసుకున్న నిర్ణయం ప్రకారం.. వాటిని కొనసాగించేందుకే మొగ్గు చూపింది. నాటి యూపీఏ ప్రభుత్వంలోని కొందరు నేతల కమీషన్ల కక్కుర్తితో ఆర్టీసీకి బలవంతంగా అంటగట్టిన లోఫ్లోర్ బస్సుల కథే ఇది.
ఆది నుంచీ అంతే..
పెద్ద నగరాల్లో ప్రీమియం కేటగిరీ బస్సులు తిప్పాలని నిర్ణయించిన నాటి యూపీఏ ప్రభుత్వం.. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద హైదరాబాద్కు 100 వరకు లో ఫ్లోర్ బస్సులను అందజేసింది. స్థానికంగా కంపెనీల నుంచి చాసిస్ కొని ఆర్టీసీనే సొంతంగా బస్బాడీ రూపొందించుకునే వెసులుబాటు ఉన్నా.. కొందరు రాజకీయ నేతలు కమీషన్లకు కక్కుర్తిపడి నాసిరకం బస్సులు కొనిపించి సరఫరా చేశారు. లో ఫ్లోర్ బస్సులు పెద్ద వయసు వారికి, వికలాంగులకు సౌకర్యంగా ఉంటాయని చెప్పి అంటగట్టారు. కానీ తయారీలో లోపాలతో అవి ఆది నుంచి ఆర్టీసీకి పెద్ద గుదిబండగా మారాయి.
ఎట్టకేలకు ఏసీ బస్సుల ఉపసంహరణ
లో ఫ్లోర్ కేటగిరీలో ప్రస్తుతం 30 వరకు ఏసీ బస్సులు తిప్పుతున్నారు. భారంగా మారటంతో వాటిని ఉపసంహరించాలని తాజాగా ఆర్టీసీ నిర్ణయించింది. అవి ఇప్పటికే 5 లక్షల కిలోమీటర్ల మేర తిరగటంతో 20 వరకు బస్సులను షెడ్డుకు పరిమితం చేశారు. కానీ నాన్ ఏసీ బస్సులను మాత్రం 10 లక్షల కిలోమీటర్ల వరకు తిప్పాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. దీనిపై ఇప్పుడు డిపో మేనేజర్లు గగ్గోలు పెడుతున్నారు. తాము ఎంత పకడ్బందీగా పనిచేసి ఆదాయాన్ని పెంచినా, ఈ బస్సుల వల్ల చివరకు నష్టాలే మిగులుతున్నాయని, వాటిని కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
నష్టాలు ఇలా..