ఎల్‌పీ, పీఈటీలకు ఎస్‌ఏ హోదా 

6 Feb, 2019 00:19 IST|Sakshi
సీఎం కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలుపుతున్న  ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పాతూరి, రవీందర్, జనార్దన్‌రెడ్డి 

ఫైలుపై సీఎం కేసీఆర్‌ సంతకం 

కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రేడ్‌ 2 భాషా పండితులు(ఎల్‌పీ), పీఈటీ పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులుగా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సంతకం చేశారు. తెలుగు భాషా పండితుల పోస్టులను అప్‌గ్రేడ్‌ చేస్తామని ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని పూర్తి చేశారు. తెలంగాణలో ఇకపై గ్రేడ్‌–2 పండిట్‌ పోస్టులు ఉండవు. సీఎం కేసీఆర్‌ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 6,024 మంది భాషా పండితులకు, 793 మంది గ్రేడ్‌ 2 భాషా పండితులకు మేలు జరుగుతుంది. 

ఎమ్మెల్సీల కృతజ్ఞతలు.. 
తెలుగు పండిట్లు, పీఈటీలను స్కూలు అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్దన్‌రెడ్డి ప్రగతిభవన్‌లో మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 

హామీ నిలబెట్టుకున్న కేసీఆర్‌.. 
గ్రేడ్‌–2 భాషా పండిట్లను గ్రేడ్‌–1 పండిట్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని వివిధ ఉపాధ్యాయ సంఘా లు పేర్కొన్నాయి. పండిట్లు, పీఈటీల పోస్టులను అప్‌గ్రేడ్‌ చేస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడం, సంబంధిత ఫైలుపై సంతకం చేయ డం పట్ల ధన్యవాదాలు తెలిపాయి. కేసీఆర్‌ నిర్ణయంతో రాష్ట్రంలోని పండిట్లు, పీఈటీలకు మేలు జరుగుతుందని పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాములు, చావ రవి, టీపీఆర్‌టీయూ అధ్యక్షుడు అంజిరెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు