కన్నుల పండువగా.. సాక్షి అవార్డుల పండుగ

11 Aug, 2019 02:41 IST|Sakshi

సామాజిక సేవ, సినిమా రంగాల్లో కృషి చేసిన వారికి అవార్డులు 

‘సాక్షి’మీడియా గ్రూప్‌ చొరవను ప్రశంసించిన ప్రముఖులు

సాక్షి, హైదరాబాద్‌: సాక్షి మీడియా గ్రూప్‌ నిర్వహించిన ‘సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డులు 2018’ కార్యక్రమం శనివారం కన్నుల పండువగా సాగింది. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ముఖ్య అతిథిగా, సాక్షి గ్రూపు మాజీ చైర్‌పర్సన్‌ వైఎస్‌ భారతీరెడ్డి గౌరవఅతిథిగా పాల్గొన్నారు. 2014లో ప్రారంభమైన ‘సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డులు’ఐదో ఎడిషన్‌లో భాగంగా 2018కి సంబంధించి వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన వారికి అవార్డులు ప్రదానం చేశా రు. సామాజిక సేవ, విద్య, ఆరోగ్య పరిరక్షణ, క్రీడ లు, సినిమా రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వారికి అవార్డులు ప్రదానం చేశారు.

సినీ నటి ఝాన్సీ వ్యాఖ్యానం, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ దీపికారెడ్డి బృందం ‘స్వాగతాంజలి’కూచిపూడి నాట్యంతో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యఅతిథి గా హాజరైన గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, గౌర వ అతిథి వైఎస్‌ భారతీరెడ్డి చేతుల మీదుగా వ్యవసాయ రంగంలో చెరుకూరి రామారావు, విద్యారంగంలో పెరవలి గాయత్రి, ఎంట్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా డాక్టర్‌ రమేశ్‌ కంచర్ల, తెలుగు పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ అవార్డులు అందుకున్నారు. సామాజిక సేవా రంగంలో మల్లికాంబ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మెంటల్లీ హ్యాండీకాప్‌డ్‌ సంస్థ వ్యవస్థాపకురాలు రామలీల, విద్యారంగంలో డాక్టర్‌ ఐవీ శ్రీనివాస్‌రెడ్డి, ఆరోగ్య పరిరక్షణ విభాగంలో డాక్టర్‌ బిందు మీనన్, క్రీడారంగానికి సంబంధించి గరికపాటి అనన్య, షేక్‌ మహ్మద్‌ అరీఫుద్దీన్‌ తరపున అతడి సోదరుడు అవార్డులు అందుకున్నారు. ఆరోగ్య పరిరక్షణ, సామాజిక సేవా రంగాల్లో డాక్టర్‌ యాదయ్య, హుసాముద్దీన్‌తోపాటు సబీనా జేవియర్‌ తరపున దినేశ్‌ అవార్డులు స్వీకరించారు. 

ప్రముఖుల చేతుల మీదుగా:
ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ను వైఎస్‌ భారతీరెడ్డి సన్మానించారు. అవార్డు గ్రహీతలను ఎంపిక చేసిన జ్యూరీ చైర్‌పర్సన్, పద్మ శ్రీ అవార్డు గ్రహీత శాంతా సిన్హాతో పాటు, జ్యూరీ సభ్యులుగా వ్యవహరించిన రెయిన్‌బో హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రణతీరెడ్డి, రిటైర్డు ఐపీఎస్‌ అధికారి అరుణ బహుగుణ, పి.చంద్రశేఖర్‌రెడ్డి, ఎన్జీ రంగా యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్‌ పద్మరాజు, కాటన్‌ బోర్డు మాజీ సలహాదారు దొంతి నర్సింహారెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్‌రావు, సురానా టెలికాం ఎండీ నరేంద్ర సురానా, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి వినోద్‌ అగర్వాల్‌ తదితరులకు సాక్షి మీడియా గ్రూప్‌ డైరెక్టర్‌ రాణిరెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.

భారతి సిమెంట్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ రవీందర్‌రెడ్డి, సీఈఓ అనూప్‌ కుమార్‌ సక్సేనా, వెల్లూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఉపాధ్యక్షులు శేఖర్‌ విశ్వనాథన్, శంకర్‌ విశ్వనాథన్, సాక్షి సీఈఓ వినయ్‌ మహేశ్వరి, సాక్షి మీడియా డైరెక్టర్లు ఎ.లక్ష్మీనారాయణ రెడ్డి, కేఆర్‌పీ రెడ్డి, వైఈపీ రెడ్డి, పీవీకే ప్రసాద్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పలు విభాగాల్లో సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డుల ప్రదానం జరిగింది. ‘జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ సీనియ ర్‌ నటుడు కృష్ణంరాజు, ఉత్తమ నటుడిగా రామ్‌చరణ్, ఉత్తమ నటిగా పూజాహెగ్డే, ఉత్తమ దర్శకుడిగా నాగ్‌అశ్విన్, ఉత్తమ చిత్రం గా ‘మహానటి’కి అవార్డులు ప్రదానం చేశారు. ఇంకా పలువురు నటీనటులు, సాంకేతిక నిపు ణు లు ‘సాక్షి’ ఎక్సలెన్స్‌ అవార్డులు అందుకున్నారు. 
 

మరిన్ని వార్తలు