పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

18 Jul, 2014 03:55 IST|Sakshi
పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
  • సాక్షి ‘మైత్రి’కి మంచిస్పందన
  • సాక్షి, సిటీబ్యూరో: మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం మొత్తం ఆరోగ్యకరంగా ఉంటుందని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ సుజాత అన్నారు. ప్రతి మహిళ నిత్యం ప్రొటీన్లు, విటమిన్లు ఉన్న ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలని సూచించారు. మహిళల హక్కులు, పౌష్టికాహారం, గర్భాశయ సంబంధిత సమస్యలు, యువతకు వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలపై గురువారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మైత్రి మహిళ, యువ మైత్రి కార్యక్రమాలకు జంట నగరాలకు చెందిన మహిళలు, యువతీ యువకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

    ఈ కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ మహిళలు గర్భధారణసమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రసవానంతరం తీసుకోవలసిన ఆహారం, జాగ్రత్తలను తెలియజేశారు. స్త్రీలలో వచ్చే సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్‌లను ఎలా గుర్తించాలి, ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు, ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించారు. ఈ అంశాలపై పలువురు మహిళల సందేహాలను ఆమె నివృత్తి చేశారు.
     
    చక్కని భవితకు మార్గనిర్దేశం
     
    యువత భవిష్యత్తుకు చక్కటి బాట వేయడానికి ‘సాక్షి’ చేసిన ప్రయత్నమే ‘యువ మైత్రి’ కార్యక్రమం. కెరీర్‌కు సంబంధించిన మార్గదర్శకాలపై రెండోసెషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా సభ ప్రిన్సిపల్ డాక్టర్ దుర్గ మాట్లాడుతూ యువత ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకొనిముందుకు సాగాలని సూచించారు. ప్రత్యేక ప్రణాళికను రచించుకొని, ఆసక్తి ఉన్న రంగంలో సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్నారు.

    యువత ఇంటర్వ్యూలకు హాజరైనపుడు ఎదురయ్యే సమస్యలు, వాటిపరిష్కారాలను సూచించారు. అనంతరం విద్యార్థులకు మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. మహిళల కోసం వినూత్న కార్యక్రమాలు, యువతకు కెరీర్ సంబంధించిన విషయాలపై ‘సాక్షి’ ప్రతి నెల ఉచితంగా కౌన్సెలింగ్ నిర్విహ స్తుందని నిర్వాహకులు తెలిపారు. వివరాలకు 95055 55020 నెంబర్‌లో సంప్రదించవచ్చు.
     
     అన్ని కార్యక్రమాలూ బాగున్నాయి
     ‘సాక్షి’ నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలలో నేను పాల్గొంటున్నాను. ఈ రోజు మహిళల ఆరోగ్య సమస్యలపై నిర్వహించిన వర్క్‌షాప్ చాలా ఉపయోగపడింది. నిపుణుల సలహాలతో ఎన్నో సందేహాలు తీరాయి. స్త్రీల కోసం మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నా.
     - పరంజ్యోతి, కేపీహెచ్‌బీ
     
     స్ఫూర్తినిచ్చింది
     నేను ఈ సంవత్సరమే డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత ఏ రంగాన్ని ఎంచుకోవాలి? ఎలాఅడుగు ముందుకు వేయాలో అర్థం కాని సమయంలో ఈ కార్యక్రమం గురించి తెలిసింది. ‘సాక్షి’ యువ మైత్రి పేరిట నిర్వహించిన కౌన్సెలింగ్ నాలో స్ఫూర్తిని, ఉత్తేజాన్ని నింపింది. నేటి యువతకు ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. ఏ రంగాన్ని ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్న యువతకు ఈ కార్యక్రమం ఒక వేదిక లాంటిది.    
     - మౌనిక, మల్కాజ్‌గిరి
     
     జాబ్ ఫెయిర్స్ నిర్వహించాలి
     యువత  ఏ రంగంలో రాణించాలన్నా వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం. వీటిపై ఉచితంగా వర్క్‌షాప్‌లు నిర్వహించడం బాగుంది. కె రీర్ అంశాలపై కౌన్సెలింగ్‌తో పాటు జాబ్‌ఫెయిర్స్ కూడా ఎక్కువగా నిర్వహిసే ్త బాగుంటుంది. యువతకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
     -ప్రేమచందర్, అమీర్‌పేట
     

మరిన్ని వార్తలు