అనారోగ్యంతో సాక్షి ఫొటోగ్రాఫర్‌ మృతి 

12 May, 2020 03:11 IST|Sakshi
రవికుమార్‌ (ఫైల్‌) 

ముషీరాబాద్‌ (హైదరాబాద్‌): సాక్షి దినపత్రిక స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఎం.రవికుమార్‌ (42) ఆదివారం రాత్రి మృతి చెందారు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవి అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం తన స్వగ్రామం జడ్చర్లలో జరిగాయి. మూడేళ్ల కిందట ఆయనకు బ్రెయిన్‌లో ట్యూమర్‌ ఏర్పడడంతో మొదట ఆపరేషన్‌ చేశారు. ఒక సంవత్సరం ఆరోగ్యంగా ఉన్న రవి కుమార్‌.. మళ్లీ ట్యూమర్‌ పెరగడంతో రెండవసారి ఆపరేషన్‌ చేయించుకుని ఇంటి దగ్గరే మందులు వాడుతున్నారు.

ఆరోగ్యం క్షీణించడంతో కొద్ది రోజుల కిందట ఆయన్ను స్వగ్రామం జడ్చర్లకు తీసుకువెళ్లారు. కాగా, ఆదివారం ఆరోగ్యం విషమించి మృతిచెందారు. మొదట సూర్య దినపత్రికలో పనిచేసిన ఆయన.. 11 ఏళ్లుగా సాక్షి దినపత్రికలో ఫొటోగ్రాఫర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ సమాచార శాఖ ఫొటోగ్రఫీ డే సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఆయన పలుమార్లు రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు. రవికుమార్‌ మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు.  

మరిన్ని వార్తలు