కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయం

1 May, 2015 04:04 IST|Sakshi
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయం

చిన్నశంకరంపేట: రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి దళారుల మోసాలకు అడ్డుకట్ట వేయాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఐకేపీ మహిళా సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ తమది రైతు ప్రభుత్వమైనందున వారికి మేలు చేసే చర్యలు చేపడుతున్నామన్నారు. రైతులు దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోకూడదనే, పంట చేతికొచ్చే ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 120 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

వీటితో పాటు సహకార సంఘాల ఆధ్వర్యంలో కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. దళారులను నమ్మకుండా నేరుగా  కొనుగోలు కేంద్రం లోనే  రైతులు ధాన్యం విక్రయించాలన్నారు. ధాన్యం విక్రయించిన 72 గంటల్లో నేరుగా వారి ఖాతాలో డబ్బులు జమచేస్తారన్నారు. వడగళ్ల వానలతో రైతులు నష్టపోతే వెంటనే అధికారులతో పంటనష్టం వివరాలు సేకరించామని, వారికి నెల రోజుల్లో పరిహారం అందిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలే ముఖ్యమని ఆ దిశగా సీఎం ముందుకు సాగుతున్నారన్నారు. కార్యక్రమంలో చిన్నశంకరంపేట ఎంపీపీ అధ్యక్షుడు కృపావతి, స్థానిక సర్పంచ్ కుమార్‌గౌడ్, ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్ జైసింగ్, తహశీల్దార్ నవీన్‌కుమార్,ఎంపీడీఓ రాణి, ఐకేపీ ఏపీఎం ఇందిర, సర్పం చ్‌లు సాన సత్యనారాయణ, నర్సమ్మ, అంజయ్య, సొసైటీ చైర్మన్లు శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు రాజు, నరేందర్, రమేష్, సుధాకర్, సిద్దిరాములు, శ్రీనివాస్  పాల్గొన్నారు.
 
ఎన్‌డీఎస్‌ఎల్‌కు మంచి రోజులు
మెదక్ రూరల్: నిజాం దక్కన్ షుగర్(ఎన్‌డీఎస్‌ఎల్) ఫ్యాక్టరీకి మంచిరోజులు వచ్చాయని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు.  గురువారం ఆమె లింగ్సాన్‌పల్లి, మాచవరం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్యాక్టరిని స్వాధీనం చేసుకునేందుకు సీఎం కేసీఆర్  ఓ కమిటీ నియమించారని, ఈ కమిటీ ఫ్యాక్టరీని ఎలా స్వాధీనం చేసుకోవాలనే అంశంపై చర్చిస్తుందన్నారు. అలాగే రైతులకు చెల్లించాల్సిన రూ.21 కోట్లకు గాను కేవలం  రూ. 7కోట్లు మాత్రమే యాజమాన్యం చెల్లించిదని  ఆ డబ్బులను సైతం వారం రోజుల్లో రైతులకు చెల్లించేందుకు చర్యలు చేపడతామన్నారు.  

ఒకవేళ ఆడబ్బులను ఫ్యాక్టరీ యజమాని సకాలంలో చెల్లించకుంటే  ప్రభుత్వమే చెల్లించి కంపెనీకి ఇచ్చే డబ్బుల్లో మినహాయించుకుంటుందన్నారు.  ఫ్యాక్టరీని సొసైటీ ద్వారా నడిపించేందుకు రైతులకే అప్పగిస్తామన్నారు. దీంతో  రైతులకు ఫ్యాక్టరీ కార్మికులందరికి మంచి రోజులు వచ్చాయన్నారు. అంతకు ముందు  గ్రామంలో ఎన్‌డీఎస్‌ఎల్ కార్మికులు పూలమాలతో డిప్యూటీ స్పీకర్‌ను ఘనంగా సన్మానించారు.  కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు లావణ్య, పార్టీ మండల అధ్యక్షుడు అంజాగౌడ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు