ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పై అదే పట్టు

6 Jan, 2017 03:16 IST|Sakshi

సభ ప్రారంభం కాగానే చర్చకు పట్టుపట్టిన ప్రతిపక్షాలు
ప్రశ్నోత్తరాల తర్వాత చేపడదామన్న సీఎం.. ససేమిరా అన్న విపక్షాలు
అక్బరుద్దీన్‌ అభ్యంతరంతో అన్ని పక్షాల నుంచి అభిప్రాయ సేకరణ


సాక్షి, హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంపై అసెంబ్లీలో మరోమారు వాడివేడి  చర్చ జరిగింది. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఫీజులపై చర్చకు పట్టుబట్టాయి. సీపీఎం మినహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఇదే అంశంపై స్పీకర్‌కు వాయిదా తీర్మానం ఇచ్చి చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశాయి. బుధవారం సభ ఆకస్మికంగా ముగి సిందని, ప్రతిపక్షాలు అడిగే సందేహాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ ఆందో ళనకు దిగాయి. అందుకు అంగీకరించని స్పీకర్‌.. ముందుగా ప్రశ్నోత్తరాలను కొనసాగిం చాలని, అందుకు అందరూ సహకరించాలని కోరారు. అయినా ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి.

ఈ సందర్భంగా సీఎల్పీ   నేత కె.జానారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా ఈ అంశంపై చర్చిం చాలని, ఆ తర్వాత ప్రశ్నోత్తరాలను కొనసాగిం చాలని కోరారు. ఈ దశలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యంచేసుకుంటూ.. తామేమీ ప్రతిష్టకు పోవడం లేదని, చర్చ ఆకస్మికంగా ముగిసిందని సభ్యులు భావిస్తున్నారు కనుక దీనిపై మళ్లీ మాట్లాడేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే ప్రశ్నోత్తరాల తర్వాత చర్చ కొనసాగిద్దామన్నారు. దీంతో స్పీకర్‌ ప్రశ్నోత్తరాలను చేపట్టారు.

మీ రెండు పక్షాలేనా..?: అక్బరుద్దీన్‌
ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత మాట్లాడి, సీఎం చెబితే అంతా అయిపోయినట్టేనా అని ప్రశ్నిం చారు.  దీంతో స్పీకర్‌ అన్ని పక్షాలకు అవకాశం ఇచ్చారు. కిషన్‌రెడ్డి (బీజేపీ), రేవంత్‌రెడ్డి (టీడీపీ), సున్నం రాజయ్య(సీపీఎం) మాట్లాడుతూ ఫీజులపై చర్చించాలని కోరారు. తర్వాత సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. సభలో సభ్యులు మాట్లాడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. సింగరేణిపై కూడా సభలో చర్చించాల్సి ఉన్నందున ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామన్నారు. దీంతో స్పీకర్‌ ప్రశ్నోత్త రాలను కొనసాగిస్తున్నట్టు ప్రకటిం చడంతో విపక్షాల సభ్యులు మళ్లీ ఆందోళనకు దిగారు. ప్రశ్నోత్తరాలకు ప్రభుత్వం సిద్ధమై వచ్చిందని, ఫీజుల పథకంపై సమాధానా లివ్వాలంటే అధికారులను కూడా పిలిపించి గణాంకాలను చెప్పాల్సి ఉంటుందని సీఎం చెప్పారు. ప్రశ్నోత్తరాల తర్వాత అవసరమైతే గంట సేపయినా ఫీజులపై చర్చిద్దామని చెప్పడంతో 35 నిమిషాల గందరగోళానికి తెరపడి ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి.

బకాయిలు వెంటనే చెల్లించండి
ప్రశ్నోత్తరాల తర్వాత 11:30 గంటల సమ యంలో ఫీజులపై చర్చకు స్పీకర్‌ అనుమ తించారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడు తూ.. గత ప్రభుత్వాల హయాంలో పేరుకు పోయిన బకాయిలను చెల్లించడం భారంగా మారిందనే కోణంలో ప్రభుత్వం సమాధానం చెప్పడం సరి కాదన్నారు. 2014లో తాము అధికారంలో ఉన్నప్పుడు ఫిబ్రవరిలోనే గవర్నర్‌ పాలన వచ్చిందని, తెలంగాణ ఆందోళనలు జరిగాయని, చివరి త్రైమాసికం నిధులు రాక పోవడంతో కొన్ని బకాయిలు ఉన్నాయన్నారు. 2014–16 మధ్య మధ్య తెలంగాణ ప్రభుత్వమే రూ.1,800 కోట్ల మేర బకాయిలు పెట్టిందన్నారు. తర్వాత కె.లక్ష్మణ్, ఆర్‌.కృష్ణయ్య, రాజయ్యలు మాట్లాడుతూ ఫీజులు వెంటనే చెల్లించాలని  కోరారు.

గణాంకాలతో అక్బర్‌ ప్రసంగం
ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్‌ ఈపాస్‌ వెబ్‌సైట్‌లో ఉన్న గణాంకాలను పేర్కొంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. 2015–16లో 2,22,475 మంది అర్హులు ఉంటే కేవలం ఏడుగురి దరఖాస్తులు మాత్రమే రిజి స్టర్‌ అయ్యాయని, 2016–17లో మొత్తం 9,02,898 విద్యార్థులు అర్హులు అయితే.. 7,70,953 మంది రిజిస్టర్‌ చేసుకున్నారని, ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. ఇంజ నీరింగ్‌ కాలేజీలను మూసివేయాలని సీఎం చెప్పడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు