రాష్ట్రంలో శాంసంగ్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌!

20 Jan, 2017 02:38 IST|Sakshi
రాష్ట్రంలో శాంసంగ్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌!

ఏర్పాటుకు ఆహ్వానించిన మంత్రి కేటీఆర్‌
ప్రపంచంలోనే అత్యుత్తమ ప్యాకేజీ అందించేందుకు సిద్ధమని స్పష్టం


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న వైద్య పరికరాల ఉత్పత్తి పారిశ్రామికవాడలో యూనిట్‌ను ఏర్పాటు చేయాలని శాంసంగ్‌ సంస్థ ను పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామా రావు ఆహ్వానించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా గురువారం పరిశ్రమలు, ఐటీ శాఖ కార్య దర్శి జయేశ్‌ రంజన్‌తో కలసి శాంసంగ్‌ ఇన్నో వేషన్‌ మ్యూజియంను మంత్రి సందర్శించారు. అనంతరం శాంసంగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంగ్‌ మోయిమ్, వైస్‌ ప్రెసిడెంట్‌ పీటర్‌ రీ బృందంతో సమావేశమైన మంత్రి.. హైదరాబాద్‌లో శాంసంగ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఆర్‌ అండ్‌ డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేసి స్థానిక భాషల్లో ఉత్పత్తులు రూపొందించాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు శాంసంగ్‌ ముందుకొస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ ప్యాకేజీ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎలక్ట్రానిక్‌ పరిశ్ర మలకు రాష్ట్రంలో కల్పించే మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలు, రాష్ట్ర పరిశ్రమల పాలసీ గురించి శాంసంగ్‌ ప్రతినిధులకు మంత్రి వివరించారు.

రాష్ట్రంలో కొరియన్‌ పారిశ్రామిక పార్కు
రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, లైఫ్‌ సైన్సెస్, ఆటోమోటివ్, మెషినరీ, ఇంజనీరింగ్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలున్నా యని దక్షిణ కొరియా పారిశ్రామికవేత్తలకు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇన్‌ దక్షిణ కొరియా ఆధ్వర్యంలో సియోల్‌ లో ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తల సదస్సులో మంత్రి ప్రసంగించారు. దక్షిణ కొరియాలో భారత రాయబారి విక్రం దొరై స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో కొరియన్‌ సంస్థల కోసం ప్రత్యేక కొరియన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణకు వచ్చే ప్రతి కొరియన్‌ పెట్టుబడికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. దేశంలో ఉత్తమ సదుపాయాలు, విధానాలు ఉన్న తెలంగాణ రాష్ట్రమే కొరియన్‌ కంపెనీలకు ఆకర్షణీయ ప్రాంతమన్నారు. తెలంగాణ రాష్ట్రం గురించి, ప్రభుత్వ విధానాల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజేంటేషన్‌ ద్వారా అక్కడి పారి శ్రామికవేత్తలకు వివరించారు.

మరిన్ని వార్తలు