ఇసుక రవాణాకు  ‘కోడ్‌’ బ్రేక్‌

15 Oct, 2018 10:52 IST|Sakshi
పెద్దవాగు ట్రాక్టర్లు (ఫైల్‌)

 సాక్షి, మోర్తాడ్‌: ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చి న నేపథ్యంలో అభివృద్ధి పనులకు ఇసుకను రవాణా చేయడాన్ని నిలిపి వేస్తూ రెవెన్యూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పెద్దవాగులో గుర్తించిన పలు పాయింట్ల నుంచి బుధ, శుక్రవారాలలో అభివృద్ధి పనుల కోసం ఇసుకను తరలించే వారు. మో ర్తాడ్‌ మండలంలోని సుంకెట్, ధర్మోరా, వేల్పూర్‌ మండలంలోని కుకునూర్, కోమన్‌పల్లి, వెంకటాపూర్‌ పాయింట్ల నుంచి ఇసుకను తరలించే వారు. జక్రాన్‌పల్లి మండలంలోని పలు గ్రామాల నుంచి కూడా అభివృద్ధి పనుల కోసం ఇసుకను తరలించేందుకు అనుమతి ఇచ్చేవారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో గతంలో ప్రారంభించిన పనులతో పాటు, కొత్తగా చేపట్టబోయే అభివృద్ధి పను లను నిలపివేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది.

దీంతో రూ.కోట్లాది విలువ చేసే అభివృద్ధి పనులకు బ్రేక్‌ పడింది. అభివృద్ధి పనులను నిలిపి వేయాలని ఎన్నికల కమిషన్‌ ముందుగానే ఆదేశించడంతో అభివృద్ధి పనుల కోసం ఇసుక అవసరం ఉండదని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. అభివృద్ధి పను లు జరుగనప్పుడు ఇసుక రవాణాకు అను మతి ఇవ్వకూడదని రెవెన్యూ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఒకవేళ అభివృద్ధి పనులకు ఇసుకను తరలించేందుకు అనుమతి ఇస్తే తరలించిన ఇసుక పక్కదారి పట్టే అవకాశం ఉందని అధికారులు సందేహిస్తున్నారు.

దీంతో ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వకపోవడమే మంచిదని అధికారులు ఆలోచిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన నుంచి ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వడం లేదు. ఇది ఇలా ఉండగా ప్రైవేటు భవనాల నిర్మాణం కోసం మాత్రం ఇసుక రవాణా చేసేందుకు అనుమతి ఇచ్చే అవకా శం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పనులకు ఒక ట్రిప్పునకు రూ.500 లను వసూలు చేస్తుండగా ప్రైవేటు నిర్మా ణాలకు ఇసుక కోసం రూ.900ల చొప్పున వసూలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు