సారపాక ప్రాజెక్టు రోల్‌మోడల్ కావాలి

31 Jan, 2015 07:15 IST|Sakshi
  • తాగునీటి వృథాను అరికట్టాలి : కలెక్టర్ ఇలంబరితి
  • సారపాక(బూర్గంపాడు): మండలంలోని సారపాకలో ఐటీసీ ఆర్థిక, సాంకేతిక సహకారంతో చేపట్టిన ఇంటింటికి తాగునీటి పథకం తెలంగాణ రాష్ట్రంలోనే రోల్‌మోడల్‌గా నిలవాలని కలెక్టర్ ఇలంబరితి అన్నారు. సారపాకలోని తాళ్లగొమ్మూరులో రూ.9 కోట్ల వ్యయంతో ఐటీసీ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన ఇంటింటికి తాగునీటి పథకానికి శుక్రవారం కలెక్టర్ ఇలంబరితి పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలే పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, ఐటీసీ సీఈఓ సంజయ్‌సింగ్, సర్పంచ్ చందూనాయక్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు.

    అనంతరం రూ3 కోట్ల వ్యయంతో ఐటీసీ పీఎస్‌పీడీ ఆధ్వర్యంలో నిర్మించిన సామాజిక భవనాన్ని (ఐటీసీ- ధరావత్ రాజు కమ్యూనిటీహాల్)ను వారు ప్రారంభించారు. ఈ సంద ర్భంగా జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటింటికి తాగునీటి పథకాన్ని రూపొందించాలని, తాగునీరు వృథా కాకుండా మీటర్లను అమర్చాలని అన్నారు. ఇంటింటికీ తాగునీటి పథకంలో మీటర్లు అమ ర్చి ప్రజల నుంచి బిల్లులు వసూలు చేయడం వల్ల నీటి వృథా తగ్గుతుందని అన్నారు. అలాగే పథకం నిర్వహణకు నిధుల కొరత ఉండదని అన్నారు. పరిసర గ్రామాల అభివృద్ధికి ఐటీసీ అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు.
     
    ఆస్పత్రికి, క్రీడామైదానాలకు భూమి కేటాయించాలి : ఎమ్మెల్యే పాయం

    పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలో కార్మికులకు, స్థానికులకు వైద్యసేవలు అందించేందుకు ఐటీసీ యాజమాన్యం ఈఎస్‌ఐ ఆస్పత్రికి భవనం నిర్మించాలని, అందుకోసం ప్రభుత్వ భూమిని కేటాయించాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్‌ను కోరారు. సారపాకలో క్రీడామైదానాన్ని ఐటీసీ వారు అభివృద్ధి చేయాలని అన్నారు. ఐటీసీ మెగా ప్రాజె క్టు ఏర్పాటుకు స్థానికులు తగు విధంగా సహకరిస్తారని ఎమ్మెల్యే అన్నారు.

    ఎమ్మెల్యే విజ్ఞప్తిపై స్పందించిన కలెక్టర్ సారపాకలో ఈఎస్‌ఐ ఆస్పత్రి, క్రీడామైదానానికి ప్రభుత్వ భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఐటీసీ సీఈఓ సంజయ్‌సింగ్ కూడా స్పందించారు. ఆస్పత్రి భవన నిర్మాణానికి ఐటీసీ సహకరిస్తుందని అన్నారు. అనంతరం ఆశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతు ఐటీసీ పరిసర గ్రామాలలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలు అభినందనీయమన్నారు.

    ఐటీసీ సీఈఓ సంజయ్‌సింగ్ మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధికి సహకరిస్తున్న స్థానికులకు మేలు చేసేందుకు ఐటీసీ కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ పీఎస్‌పీడీ యూనిట్ హెడ్ నాగహరి, జనరల్ మేనేజర్‌లు సీహెచ్ విజయసారధి, ఎన్‌బీ శ్రీనివాసరావు, కృష్ణమోహన్, తహశీల్దార్ అమర్‌నాథ్, ఎంపీడీఓ ధన్‌సింగ్, కాంట్రాక్ట్ అసోసియేషన్ ప్రతినిధులు పీవీ రామారావు, పాకాల దుర్గాప్రసాద్, బూసిరెడ్డి శంకరరెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకులు పోటు రంగారావు, మారం వెంకటేశ్వరరెడ్డి, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు