హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ

15 Sep, 2019 08:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ కన్నుమూశారు. తండ్రి అంత్యక్రియల కోసం సత్య నాదెళ్ళ హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ నుంచి బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని నివాసానికి చేరుకున్నారు. జుబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో యుగంధర్‌ అంత్యక్రియలు నిర్వహించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీఎన్‌ యుగంధర్‌ 1962 సివిల్‌ సర్వీస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి. 1983-85 మధ్య అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వద్ద పనిచేశారు. ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. అలాగే ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. ప్లానింగ్‌ కమిషన్‌ సభ్యుడిగా, లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ డైరెక్టర్‌గా సేవలందించారు. అనంతపురం జిల్లా బుక్కాపురంలో జన్మించిన యుగంధర్‌ తన పేరులో బుక్కాపురం నాదెళ్ల యుగంధర్‌గా రాసుకున్నారు. ఆయన భార్య గతంలోనే కన్నుమూశారు. వారి ఏకైక సంతానం సత్య నాదెళ్ల. బీఎన్‌ యుగంధర్‌ మరణంపట్ల తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్‌.జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. యుగంధర్‌ కుటుంబానికి, ఆయన కుమారుడు సత్య నాదెళ్లకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

>
మరిన్ని వార్తలు