బాలల చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి

2 Nov, 2019 03:30 IST|Sakshi

రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతీ రాథోడ్‌

సాక్షి, హైదరాబాద్‌: బాలల రక్షణ చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేయగలిగితే రాష్ట్రంలో వారికి మంచి భవిష్యత్తు అందించగలమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతీ రాథో డ్‌ అన్నారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ కొత్తగా ఏర్పాటైన సందర్భంగా శుక్రవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీవితాన్ని కోల్పోతున్న బాలల కోసం మనసు పెట్టి పనిచేయాలని సూచించారు.ఆలనా పాలనా కోసం ఎదురు చూస్తున్న వారిని చేరదీసి, వారికి చేయూత అందించాలన్నారు.రాష్ట్రంలో బాలలు, మహిళలకు ఎలాంటి లోటులేకుండా సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు.

బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఏర్పాటుతో పిల్లలకు కచ్చితంగా మేలు జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.రాష్ట్రంలో చాలామంది బాలలు విధివంచితులుగా ఉన్నారని, వారు చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన చెందారు. ‘యూనిసెఫ్‌’తో సమన్వయం చేసుకుని బాలల సంరక్షణ, హక్కుల పరిరక్షణ చేయాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ జోగినపల్లి శ్రీనివాసరావు, సభ్యులు అంజన్‌ కుమార్, చిట్టిమల్ల రాగజ్యోతి, శోభారాణి, అపర్ణ, ఎడ్లపల్లి బృందాదర్‌ రావు, ఏ. దేవయ్య, మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్, బాల నేరస్తులు, వీధి బాలల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ శైలజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు