ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ

27 Jan, 2019 01:27 IST|Sakshi

ప్రజాస్వామ్య విలువలు గొప్పవి 

గణతంత్ర వేడుకలో స్పీకర్‌ పోచారం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాస్వామ్య విలువలు గొప్పవని, వాటిని కాపాడుకోవాల్సిన అవససరం ఉందని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ తోడ్పడాలని ఆయన కోరారు. అసెంబ్లీలో శనివారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనమండలిలో చైర్మన్‌ వి.స్వామిగౌడ్, శాసనసభలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం మాట్లాడారు.

‘‘తెలంగాణ రాష్ట్ర, దేశ ప్రజలందరికీ 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశానికి దిశానిర్దేశం చేయడానికి రచించిన రాజ్యాంగం అత్యంత విలువైంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగమే మూలం. రాజ్యాంగాన్ని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు గౌరవిస్తారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి అందరూ కృషి చేయాలి. ప్రకృతి, ఆర్థిక సంపదలకు మానవ వనరులు తోడయితే అద్భుతాలు సాధిం చొచ్చు. దేశంలో పేద, ధనికులు మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. 30% మంది దగ్గరే మొత్తం సంప ద కేంద్రీకృతమై ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి అసమానతలను తొలగించే ప్రయత్నం చేయాలి. ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చే పవిత్రమైన శాసన సభలోనూ రాజకీయాలు మాట్లాడితే అభాసుపాలవుతాం.

నేరాలు తగ్గి శాంతిభద్రతలు పెరిగితే అభివృద్ధి పెరుగుతుంది. రాష్ట్రంలో నేరాలు తగ్గుతున్నాయి. శాంతిభద్రతలను కాపాడుతున్న పోలీసు సిబ్బందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’’అన్నారు. ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, పి.సుధాకర్‌రెడ్డి, ఎన్‌.రాంచందర్‌రావు, ఆకుల లలిత, ఎం.ఎస్‌.శ్రీనివాస్‌రావు, బాలసాని లక్ష్మీనారాయణ, పూల రవీందర్, బోడికుంటి వెంకటేశ్వర్లు, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో తొలిసారి నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తరువాత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 

మరిన్ని వార్తలు