12 నుంచి బడి

25 May, 2019 01:17 IST|Sakshi

ఎండ తీవ్రత నేపథ్యంలో సెలవుల పొడిగింపు

సీఎం ఆదేశాల మేరకు విద్యా శాఖ నిర్ణయం 

బడిబాటపై రాని స్పష్టత 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వేసవి సెలవులు ముగించుకొని వచ్చే నెల 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్య అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం జూన్‌ 1 నుంచే బడులు ప్రారంభం కావాల్సి ఉంది. వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలో జూన్‌ 11 వరకు బడులకు సెలవులు పొడిగించాలని, 12 నుంచి బడులు తిరిగి ప్రారంభించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు విద్యా శాఖ అధికారు లను ఆదేశించారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జూన్‌ 4 నుంచి ప్రారంభం కావాల్సిన బడిబాట ఉన్నట్లా.. లేనట్లా అన్నది తేలాల్సి ఉంది. వాస్తవానికి జూన్‌ 1న బడులు ప్రారంభమవుతాయి కాబట్టి టీచర్లంతా 1 నుంచి 3 వరకు బడి బాట కార్యక్రమాలకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, 4 నుంచి బడిబాటను నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు పాఠశాలల పునఃప్రారంభం తేదీని 12కు వాయిదా వేయడంతో బడిబాటపై టీచర్లు ఆలోచనలో పడ్డారు. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం బడులకు సెలవులను పొడిగించిన నేపథ్యంలో ఆ ఉత్తర్వులు టీచర్లకు కూడా వర్తిస్తాయని పేర్కొన్నాయి. 

సమీక్షించి నిర్ణయిస్తాం: పాఠశాల విద్య కమిషనర్‌ 
పాఠశాలల పునఃప్రారంభ తేదీని ప్రభుత్వం వాయిదా వేసిన నేపథ్యంలో బడిబాట విషయంలో సమీక్షించి నిర్ణయిస్తామని పాఠశాల విద్య కమిషనర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం వచ్చే నెల 4 నుంచి నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు.   
 

మరిన్ని వార్తలు