హృదయవిదారకం

27 Jul, 2014 02:01 IST|Sakshi
హృదయవిదారకం

పిల్లల అవస్థ చూడలేక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు   
 విషమంగా నలుగురు విద్యార్థుల పరిస్థితి
 
 సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: ‘డాక్టర్ అంకు ల్... నా కాలు కదలడం లేదు. చేయి పైకి రావడం లేదు. తల ఎటూ తిప్ప లేకపోతున్నా. ఒళ్లంతా ఒకటే నొప్పి. ప్లీజ్... నన్ను మా మమ్మీ దగ్గరికి పం పించండి...’ మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొట్టిన సంఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి ఏసీయూ, ఏఎన్‌సీయూ వార్డుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల హృదయ విదారక వేడుకోలు ఇది. పిల్లలు పడుతున్న అవస్థను చూడలేక తల్లిదంద్రులు అక్కడే కుప్పకూలుతున్న దృశ్యాలు అందరితో కంటతడిపెట్టిస్తున్నాయి.
 
 నలుగురి పరిస్థితి ఆందోళనకరం...
 
 ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 20 మంది విద్యార్థుల్లో తరుణ్(7), వైష్ణవి(11), ప్రశాంత్(6), వరుణ్‌గౌడ్(7)ల పరిస్థితి అత్యంత విషమంగా, శిరీష(8), శ్రావణి(6), శరత్(6)ల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని, నితుషా(7), సందీప్(5), శివకుమార్(5), అభినందు(9)ల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ లింగయ్య, డాక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
 
 వార్డుకు తొమ్మిది మంది తరలింపు...
 
 ఇప్పటి వరకు ఏసీయూలో చికిత్స పొందిన సాయిరాం(4), రుచితగౌడ్(8), సాత్విక(6), నబిరా ఫాతి మా(9), హరీష్(7), మిహ పా ల్‌రెడ్డి(4), సద్భా వనాదాస్(3), దర్శన్ గౌడ్(6), కరుణాకర్(9)లను జనరల్ వార్డుకు తరలించారు. అభినందు (9), శివకుమార్(5), సందీప్(5), నితూష(7)ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఏసీయూ విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. బాధితుల్లో 16 మందికి భవిష్యత్‌లో ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. మిగిలిన వారి పరిస్థితి ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. ఇదిలా ఉంటే ఎంపీలు బండారు దత్తాత్రేయ, కవిత, బాల్క సుమన్, సీపీఐ నాయకులు నారాయణ, మాజీ మంత్రి సునీతా లకా్ష్మరెడ్డి తదితరులు బాధితులను పరామర్శించారు.
 
 విషాదంలోనే ఆ గ్రామాలు...
 
 గజ్వేల్/తూప్రాన్: రైలు, బస్సు ప్రమాద దుర్ఘటన జరి గి మూడు రోజులు అవుతున్నా ఆ గ్రామాన్ని విషాదం వీడడం లేదు. కొందరు మృతి, మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉండడంతో వెంకటాయపల్లి తల్లడిల్లుతోంది. గ్రామానికి చెందిన శివ్వం పేట మల్లాగౌడ్-లత దంపతుల కుమార్తె శృతి ప్రమాదంలో మృతిచెందగా.. మరో కుమార్తె రుచిత కోలుకుంటోం ది. కుమారుడు వరుణ్ ఇంకా స్పృహలోకి రాలేదు. శృతి సంస్కారాల కోసం ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్న పిల్లలను వదిలి.. ఆ దంపతులు శనివారం తమ ఇంటికి చేరుకున్నారు. అలాగే మన్నెస్వామి-లావణ్య  కుమారుడు సద్భావన్(నర్సరీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దేవతా సత్యనారాయణ-గాయత్రి  కుమార్తె సాత్విక (ఫస్ట్ క్లాస్), తొంట స్వామి-నర్సమ్మల కుమారుడు ప్రశాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఇక జిన్నారం మండలం కానుకుంటకు చెందిన తప్పెట లక్ష్మణ్-వీరమ్మల కుమారుడు సాయిరామ్ (యూకేజీ) వెంకటాయపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటుండగా ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. అయ్యాలం- నీలమ్మల కుమారుడు శివకుమార్, లంబ రమేష్-పార్వతిల కుమార్తె శ్రావణి, ఉప్పల దుర్గయ్య-కవితల కుమారుడు సందీ ప్‌ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
 
 ట్రైన్ వస్తుందని చెబుతూనే ఉన్నా
 మూడవ సీట్‌లో కూర్చున్నా. ట్రైన్ వచ్చేది చూశా. డ్రైవర్ అంకుల్ ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నాడు. అంకుల్ ట్రైన్ వస్తుందని చెప్పినా వినిపించుకోలేదు. పట్టాల మీదకు వచ్చి బస్సు ఆగింది. స్టార్ట్ కాలేదు. అంతలోనే ట్రైన్ వచ్చి బస్సును గుద్దింది.  పక్క సీట్లో కూర్చున్న సద్బావన్, మహిపాల్‌రెడ్డిలను కిటికిలోంచి భయటకు తోసేశా. తమ్ముడు వరుణ్‌ను తోసేందుకు ప్రయత్నించినా కిటికిలో పట్టలేదు.         
 - రుచిత
 
 ఆడుకుంటూ ఉన్నా..
 బస్సులో ప్రెండ్స్‌తో ఆడుకుంటూ ఉన్నా. పట్టాలపైకి వచ్చే సరికి బస్సు ఆగిపోయింది. ట్రైన్ వచ్చి బస్సును గుద్దింది. చేయి విరిగి నొప్పేసింది... మమ్మీ, డాడీ అంటూ ఏడుస్తూ కూర్చున్నా...
 - సాత్విక
 
 ఏమైందో తెలియదు
 నాలుగవ సీట్లో కూర్చున్నా.పెద్ద శబ్ధం వచ్చింది. చూసేలోపే దెబ్బలు తగిలాయి. ఏమైందో తెలియదు. కిందపడిపోయాను.
 - సాయిరాం
 
 గాల్లో ఎగిరిపడ్డా
 నేను, మహిపాల్ ఫ్రెండ్స్ ఇద్దరం ఒకే సీట్‌లో కూర్చున్నాం... పెద్ద శబ్దంతో బస్సు కిందపడిపోయింది... అక్క రుచిత తోసేయడంతో గాల్లో ఎగిరిపోయి బయటపడ్డాను. నా కాలు పోయింది మమ్మీ... అంటూ ఏడుస్తున్నా.... అక్కడ చాలా మంది అంకుల్ వాళ్లు ఉన్నారు... నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు... ఆ స్కూల్‌కు ఇంక వెళ్లను.... ఇద్దరం ఫ్రెండ్స్ ఊర్లోనే స్కూల్‌కు వెళతాం.
 - సద్భావన్‌దాస్
 
 బ్లడ్‌తో బట్టలు నిండిపోయాయి..
 నాలుగవ సీట్లో త్రిష, నేను కూర్చుని  మాట్లాడుకుంటున్నాం. ట్రైన్ బస్సును ఢీకొట్టింది. గట్టిగా అరుస్తున్నాం. క్షణాల్లో అందరికి దెబ్బలు. బ్లడ్‌తో బట్టలు నిండిపోయాయి.     
 - నబిరా ఫాతిమా
 
 ఆ బస్సు ఎక్కను
 ఆ బస్సెక్కను.. ఆ బడికి పోను..   అక్కడికి వెళ్లడం వల్లే నా కాళ్లకు దెబ్బలు తగిలాయి. ఇంటిదగ్గరున్న బడికి పోతా.
 - మహిపాల్‌రెడ్డి
 

మరిన్ని వార్తలు