వేద విద్య ప్రోత్సాహానికి పాఠశాలలు: ఇంద్రకరణ్‌ 

14 Aug, 2018 05:10 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి. చిత్రంలో విద్యాశంకర భారతీస్వామి, మంత్రి ఇంద్రకరణ్‌

సాక్షి, హైదరాబాద్‌: దేవాలయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, పూజారులు, వేద పండితులు, సిద్ధాంతుల సంక్షేమానికి పాడుతోందని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ, భాషా సాంస్కృతిక శాఖలు, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ సహకారంతో రెండు రోజుల తెలంగాణ జ్యోతిష మహాసభలు–2018 సోమవారం రవీంద్రభారతిలో ప్రారంభమయ్యాయి. వేదవిద్యను ప్రోత్సహించేందు కు రాష్ట్రంలో అవసరమైనన్ని వేద పాఠశాలలు ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు. విద్యుత్‌ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ, జ్యోతిష మహాసభలు సమాజ శ్రేయస్సుకు, రాష్ట్ర సంక్షేమానికి తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు.

పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభినవోద్ధండ విద్యాశంకర భారతీస్వామి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ సనాతన జ్యోతిశ్శాస్త్ర విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. తెలంగాణ విద్వత్సభ అధ్యక్షుడు యాయ వరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి మాట్లాడుతూ, ఈ మహాసభలు రాబోయే పండుగల తేదీలపై ఏకాభిప్రాయం సాధించేందుకు దోహదపడతాయన్నారు. జ్యోతిశ్శాస్త్ర వైభవమ్‌ విశిష్ట సంచికను ఆవిష్కరించి తొలి ప్రతిని గాయత్రీ పీఠం తత్త్వానంద రుషికి అంద జేశారు. కార్యక్రమంలో ‘దర్శనమ్‌’ ఆధ్యాత్మిక మాసపత్రిక సంపాదకుడు మరుమాముల వేంకటరమణ శర్మ, ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి సముద్రా ల వేణుగోపాలాచారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాసంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ సభ్యులు బోర్పట్ల హనుమంతాచార్య, కవేలి అనంతాచార్యులు, కృష్ణమాచార్య సిద్ధాంతి, అంతర్వేది కృష్ణమాచార్యులు, తెలంగాణ విద్వత్సభ ఉపాధ్యక్షుడు ఐనవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు