ఓటుకు కోట్లు : ఏది జరిగినా మీరే బాధ్యులు..!

7 Mar, 2019 12:58 IST|Sakshi

నా ఒత్తిడి మేరకే బాబు సొమ్ము పెంచారు..!

స్టీఫెన్‌ సన్‌తో సెబాస్టియన్‌ సంభాషణ

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో గురువారం మరో వీడియో బయటపడింది. స్పై కెమెరాలకు సమాంతరంగా ఏసీబీ ఏర్పాటు చేసిన ఫోన్‌ కెమెరాలో తాజా వీడియో రికార్డయింది. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యే, ఆంగ్లో ఇండియన్‌ ఎల్విస్‌ స్టీఫెన్‌సన్‌ను కొనుగోలు చేసేందుకు రూ.5 కోట్లకు బేరం కుదిరినట్టు ఈ వీడియో లో స్పష్టమైంది. టీడీపీ నేత సెబాస్టియన్‌, స్టీఫెన్‌సన్‌తో.. ‘తొలుత బాబు గారు 3.5 కోట్లు ఇవ్వడానికే ఒప్పుకున్నారు. నా ఒత్తిడి మేరకు రూ. 5 కోట్లు ఇవ్వడానికి సరేనన్నారు’ అని మాట్లాడారు. అదే సమయంలో.. రేవంత్‌రెడ్డి బయటకు వెళ్లిన తర్వాత స్టీఫెన్‌సన్‌కు ముట్టజెప్పే సొమ్ములో తన కొచ్చే కమీషన్‌ గురించి కూడా సెబాస్టియన్‌ మాట్లాడినట్టు తెలుస్తోంది. (సార్‌ ఎవరు? )

ఈ వ్యవహారంలో మధ్యవర్తులు ఉన్నట్టు వారి మధ్య జరిగిన సంభాషణ ద్వారా వెల్లడైంది. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు రేవంత్‌ను అదుపులోకి తీసుకోవడంతో ఈ వీడియో ముగుస్తుంది. కాగా, ఈ డీల్‌ సమయంలో స్టీఫెన్‌సన్‌కు ఇచ్చిన రూ.50 లక్షల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనేది తేలాల్సి ఉంది. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో మనీ లాండరింగ్‌ జరిగిందనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెండ్‌ డెరెక్టరేట్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కొనుగోలు వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించినది ఎవరేనేది కూడా విచారణలో తేలనుంది. గత నాలుగేళ్లుగా నలుగుతున్న ఈ కేసులో తాజా వీడియోతో విచారణ వేగం కావొచ్చని పలువురు భావిస్తున్నారు. (‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!)

కాగా,‘ఓటుకు కోట్లు’ కేసులో ఈడీ విచారణ చేపట్టి‍న సంగతి తెలిసిందే. ఈ కేసులో వేం నరేందర్‌ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలతో పాటు మరో నాలుగున్నర కోట్లు ఎక్కడ అంటూ నరేందర్‌ రెడ్డిపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్‌ రెడ్డితో పాటు వేం నరేందర్‌ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. (ఆ 50 లక్షలు హవాలా సొమ్మా?)

తాజా వీడియో ఆధారంగా సంభాషణ..
స్టీఫెన్‌సన్‌ : లెటస్‌ గో టు ది డీల్‌..

సెబాస్టియన్‌ : నిజానికి బాబు ముందు 3.5 కోట్లు మాత్రమే ఇస్తానని చెప్పారు. నా ఒత్తిడి మేరకు రూ.5 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. రేవంత్‌ రెడ్డిని మీరు నమ్ముతున్నారు. బాబు నన్ను నమ్ముతున్నారు. మీరు రేవంత్‌ రెడ్డిని నమ్మడంతో ఆయన తెరమీదకు వచ్చారు. ఏది జరిగినా మీరే బాధ్యులు..  ఓకే సార్‌.

సంబధిత వార్తలు..
దొరికిన దొంగ చంద్రబాబు; సంచలనం

‘ఓటుకు కోట్ల’కు.. ‘మే’ ముహూర్తం!

ఓటుకు కోట్లు కేసు; సుప్రీం ఆదేశాలు

మరిన్ని వార్తలు