మహబూబ్నగర్ క్రైం,న్యూస్లైన్: పోలవరం ముంపు ప్రాంతాలుగా గుర్తించిన ఏడు ప్రాం తాలను ఆంధ్రప్రదేశ్లో కలపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ గురువారం బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
ఈ నేపధ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నట్లు జి ల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ వెళ్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బందు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్లలో, ఆర్టీసి బస్డాండ్ల వద్ద, సినిమా హాళ్లు, పెట్రోల్ పంప్లు, వ్యాపార సముదాయాల వద్ద పోలీసుల పహరా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు జాతీయ రహదారిపై ఉన్న చెక్ పోస్టుల వద్ద పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ దళాలు,స్పెషల్ పోలీసులతో పాటు సివిల్. రిజర్వ్ పోలీసులు విధులు నిర్వహిస్తారని చెప్పారు. పెట్రోలింగ్ పార్టీలు బందును పర్యవేక్షిస్తారని తెలిపారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని డివిజన్ పరిధుల్లోని డీఎస్పీలు పోలీసులకు సూచనలు అందిస్తారని వివరించారు.
పజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు రాజకీయ పార్టీలు పోలీసులకు సహకారం అందించాలని కోరారు.స్వచ్ఛందంగా బందు నిర్వహిస్తే పోలీసులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.బలవంతంగా వ్యాపార సంస్థలను మూసి వేయరాదని అలా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి రాష్ట్రపతి పాలన కొనసాగుతోందని దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు,నాయకులు మసలు కోవాలని కోరారు.