ఆనవాయితీని కొనసాగిస్తున్న గిరిజనులు
తండాల్లో వైభవంగా (దాటుడు) సీత్లాపండుగ
పెద్దపుష్యమి కార్తెలోని మంగళవారాల్లో నిర్వహణ
జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన సందడి
ఆత్మకూర్(సూర్యాపేట): ప్రకృతి దేవతలను ఆరాధిస్తూ పశుసంపద వర్ధిల్లాలని, చెరువులు, కుంటలు నిండి సమృద్ధిగా పంటలు పండాలని గిరిజనులు జరుపుకునే పురాతన సంప్రదాయ పండుగ సీత్లాభవాని (దాటుడు) పండుగ. అతిపురాతన ఈ పండుగను తమ తొలి పండుగగా నేటికీ మారుమూల తండాల్లో గిరిజనులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఏటా పెద్దపుష్యమి కార్తెలో వచ్చే మంగళవారాల్లో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది ఆషాఢ మాసం పెద్దపుష్యమి కార్తెలోని తొలి మంగళవారం ఇప్పటికే చాలాప్రాంతాల్లోని తండాల్లో సీత్లాపండుగను నిర్వహించుకోగా.. మిగిలిన ప్రాంతాల్లో గిరిజనులు పండుగకు సన్నద్ధమై ఉన్నారు.
ప్రతి తండాలో ఇక్కడే..
సీత్లాపండుగను ప్రతి తండాలో తూర్పు దిక్కున ఉండే చెరువు ఒడ్డున నిర్వహిస్తారు. ఏడుగురు అక్కాచెల్లెళ్లలో సీత్లాభవాని అందరి కంటే చిన్నది. సీత్లామాత ప్రతిమ మధ్యభాగంలో ఉంచి మిగతా భవానీలను ఇరువైపులా ముగ్గురు అక్కల చొప్పున ఉండేలా తూర్పున చూసే విధంగా ప్రతిష్టిస్తారు. భవాని ప్రతిమల ఎదురుగా కొద్దిదూరంలో లుంకడ్యా పేరు మీద రాయితో చేసిన ప్రతిమను భవానీల వైపు చూసే విధంగా ఉంచుతారు. లుంకడ్యా ప్రతిమ మీదపడ్డ నీరు గుంతలో పడేలా గుంతను తీసి ఉంచుతారు.
పండుగ విధానం..
సీత్లాపండుగ నేపథ్యం..
పూర్వం నాటి నుంచి గిరిజనులు పశుసంపదను అధికంగా కలిగి ఉండి వ్యవసాయమే జీవన ఆధారంగా వ్యవసాయ క్షేత్రాల్లోనే గుడిసెలు వేసుకుని జీవించేవారు. వర్షాకాలంలో వచ్చే వాతావరణ మార్పులు, పచ్చని గడ్డితో గొర్రెలు, మేకలు, ఆవులకు వివిధ రోగాలు వస్తుండేవి. రోగాల బారిన పడి తమ పశుసంపద మొత్తం రోజురోజుకూ తగ్గిపోయి తండావాసులు తల్లాడిల్లుతున్న క్రమంలో.. ఓ రోజు రాత్రి తండాపెద్దకు గిరిజన దేవతలు మేరామ, తోళ్జా, మాత్రాల్, కంకాళి, హీంగ్లా, ద్వాళాంగర్, సీత్లా దేవతలు కలలో కనిపిస్తారు. సీత్లాదేవత తండాపెద్దతో మాట్లాడి తండావాసులంతా కలిసి తనకు జంతుబలి ఇవ్వాలని చెబుతుంది. కలలో వచ్చిన దేవతల విషయాన్ని తండావాసులకు చెప్పి జంతుబలి ఇస్తారు. నాటినుంచి నేటి వరకు తమ పశుసంపదను కాపాడుకునేందుకు, వర్షాలు కురవాలని ఏటా పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దీనికితోడుగా మరో రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి.
లుంకడ్యా నేపథ్యం..
ఓరోజు సీత్లాభవాని తన ఆరుగురి అక్కలతో కలిసి నదిలో స్నానం చేస్తుండగా లుంకడ్యా అనే వ్యక్తి వారి వస్త్రాలు తీసుకుని చెట్టు ఎక్కాడని.. విషయం తెలుసుకున్న సీత్లాభవాని మంత్రశక్తితో అతన్ని చెట్టు నుంచి దింపి ఇకపై ఏడుగురు అక్కాచెల్లెళ్లకు కాపలా కాసేలా శపించినట్లు చెప్పుకుంటారు.