ఈ దశ అత్యంత కీలకం! 

11 May, 2020 04:17 IST|Sakshi

సాక్షి’తో ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డి.శేషగిరిరావు

మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది

మనచుట్టూ ఉన్న వారిని పాజిటివ్‌లుగానే భావించాలి

లాక్‌డౌన్‌ ఎత్తేస్తే అంతా సవ్యంగా ఉన్నట్టు కాదు

ఎబోలా, సార్స్‌ కంటే కరోనా వేగంగా విస్తరిస్తోంది

వైరస్‌ సోకినా లక్షణాలు బయటపడని వారితోనే సమస్య

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి విస్తరణకు సంబంధించి ప్రస్తుత దశ అత్యంత కీలకమైందని ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డి.శేషగిరిరావు తెలిపారు. ఈ దశలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉం దని స్పష్టంచేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో సడలిం పులు, దశలవారీగా ఎత్తివేత చేపడుతున్న నేప థ్యంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయిం దని, ఇంతకు ముందులా స్వేచ్ఛగా తిరగొచ్చని కొందరిలో ఏర్పడుతున్న భావన సరికాదన్నారు. మన చుట్టూ ఉన్నవారిలో ఎవరికి పాజిటివ్‌ లక్షణాలున్నాయనేది బయటపడక పోతుండటం వల్ల వారిని కరోనా పాజిటివ్‌లుగానే పరిగణిస్తూ మన వరకు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) వెల్లడించిన వివరాల ప్రకారం.. కరోనా సోకిన వారిలో 79% మంది వైరస్‌ లక్షణాలు కనిపించని (అసిమ్‌టమ్యాటిక్‌ కేసులు) వారేనని, 21% మంది లోనే ఈ లక్షణాలు బయటపడు తున్నట్టు వెల్లడైన నేపథ్యంలో రెండింతల జాగ్రత్త చర్యలు తీసు కోవాల్సి ఉందన్నారు. ఇలాంటి వారు వైరస్‌ వ్యాప్తికి ఎక్కువగా కారణమయ్యే అవకాశం ఉండ టంతో, ఇది సోకకుండా కచ్చితమైన నియంత్రణ చర్యలు తీసుకోవడం అత్యవసరమని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ ఎత్తేశాక ఈ సమస్య మరింత తీవ్రం కానుందని, వైరస్‌ సోకినా ఆ లక్షణాలు పైకి కనిపించని వారితో రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయన్నారు. జ్వరం, దగ్గు, జలుబు, న్యూమోనియా, గొంతు సమస్యలు వంటి కరోనా లక్షణాలు లేని వారిలోనూ పాజిటివ్‌ కేసులు నమో దవుతున్నాయని, వాంతులు, విరేచనాలు, గుండె జబ్బులు, డయాబెటీస్, హైబీపీ వంటి ఆరోగ్య సమస్యలున్న వారిలోనూ ఈ కేసులు బయట పడుతున్నాయని వివరించారు. ప్రస్తుత పరి స్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశా లను ‘సాక్షి’ఇంటర్వూ్యలో శేషగిరిరావు వివరిం చారు. ముఖ్యాంశాలు.. ఆయన మాటల్లోనే..

సార్స్, ఎబోలాల కంటే..
సార్స్, ఎబోలాలతో పోల్చితే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎబోలా సోకిన వంద మం దిలో 70–80 మంది, సార్స్‌ సోకిన వంద మందిలో 10–15 మంది చనిపోతున్నారు. కరోనా విషయంలో 3–4% మరణాలే నమోదవుతున్నా, ఎబోలా, సార్స్‌తో పోల్చితే కరోనాతో పెద్ద సంఖ్యలో ఇన్ఫెక్షన్ల బారిన పడుతుండటంతో దీని వల్ల మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.

మన చుట్టూ వైరస్‌ ఉన్నవారు..
మనతో పాటు సమాజంలో మన చుట్టూ వైరస్‌ సోకిన వారు మనకు తెలియకుండానే కొనసాగు తారు. కమ్యూనిటీ స్ప్రెడ్‌ పెరిగి 60% మంది వరకు ఇది వ్యాపించడం ద్వారా హెర్డ్‌ ఇమ్యూనిటీకి అవకాశం ఏర్పడుతుంది. క్రమక్రమంగా అందరిలో రోగ నిరోధక శక్తి పెరిగాక వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టి, ఒక సాధారణ ఫ్లూ, జలుబు వంటి లక్షణా లతో మనకు తెలియకుండానే తగ్గిపోయే స్థాయికి ఇది చేరుకుంటుంది. అయితే వ్యాక్సిన్లు అందు బాటులోకి వచ్చాక లేక మెజారిటీ ప్రజలకు ఇది అలవాటయ్యే పరిస్థితి వచ్చేందుకు కొంతకాలం పడుతుంది.

మరో 6, 7 నెలలు ఇన్ఫెక్షన్లుంటాయి..
వ్యాక్సిన్‌ రావడానికి ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పట్టొచ్చునంటున్నారు. అందువల్ల కనీసం మరో 6, 7 నెలల పాటు కరోనా ఇన్ఫెక్షన్లు కొనసాగుతాయి. ఈ వైరస్‌ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ పరిస్థితులతో ఇంకొంతకాలం సహజీవనం చేయాల్సిందే.

ఇక్కడ 3 రకాల వైరస్‌ స్ట్రెయిన్లు..
ప్రపంచంలో ప్రస్తుతం 25 నుంచి 30 వరకు కరోనా వైరస్‌ స్ట్రెయిన్లు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. భారత్‌లో మూడు రకాల స్ట్రెయిన్లు ఉన్నట్టు చెబుతున్నారు. ఇక్కడ ఏ 2 ఏ స్ట్రెయిన్‌ ఎక్కువ ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఉన్న ఇమ్యూనిటీతో..
చిన్న వయసు నుంచి బీసీజీ టీకాలు, మలేరియా, టైఫాయిడ్, అమ్మవారు వంటి వాటికి మందులు, వ్యాక్సిన్లు తీసుకోవడం వంటివి మనలో ఈ వైరస్‌ నుంచి రోగ నిరోధక శక్తిని కల్పించడానికి దోహద పడుతోంది. భారతీయుల్లో జన్యుపరమైన రక్షణ, టీకాలతో వచ్చిన రోగ నిరోధక శక్తి వల్ల అమెరికా, ఇటలీ, బ్రిటన్‌ దేశాలతో పోలిస్తే ఇక్కడ తీవ్రత తక్కువ కనిపిస్తోంది.

గ్లౌజుల వాడకం తప్పనిసరయ్యే చాన్స్‌
మాస్క్‌లు, శానిటైజర్లు, చేతులు తరచుగా శుభ్రంగా కడుక్కోవడం, మనుషుల మధ్య దూరం పాటించడంతోపాటు రాబోయే రోజుల్లో వైరస్‌ సోకకుండా ఉండేందుకు గ్లౌజుల వాడకం కూడా తప్పనిసరయ్యే అవకాశాలున్నాయి.

వృద్ధులు బయటకు రావొద్దు..
65 ఏళ్లు దాటిన వారు, గుండె జబ్బులు, కిడ్నీ, కేన్స ర్, డయాలిసిస్‌ చేసుకుంటున్నవారు, శ్వాస సంబం ధ సమస్యలున్న వారు మరో కొన్ని నెలల దాకా బయటకు రాకుండా చూడాలి. హోం క్వారం టైన్‌లో నూ వారు మాస్క్‌లు ధరించడం, కుటుంబం లోని ఇతర సభ్యుల నుంచి భౌతిక దూరం పాటిం చడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

హార్ట్‌ పేషెంట్లపైనా ప్రభావం..
గుండె సంబంధిత సమస్యలున్న వారు రాబోయే చాన్నాళ్ల పాటు జాగ్రత్తగా ఉండాలి. బైపాస్‌ ఆపరేషన్, స్టెంట్లు వేయించుకున్న వారు, గుండె జబ్బున్న వారు తప్పనిసరిగా ఒక్కరోజు కూడా గ్యాప్‌ లేకుండా మందులు వాడాలి. ఆహార నియమాలు పాటిస్తూనే క్రమం తప్పకుండా పండ్లు, కూరగాయాలు ఇతర విటమిన్లు వచ్చే వాటిని తీసుకోవాలి. భవిష్యత్‌ గురించి ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా మానసిక ప్రశాంతతతో ఉండాలి. యోగా, సింపుల్‌ వాకింగ్, మెడిటేషన్‌తో పాటు ఇష్టమైన సంగీతం వింటూ ప్రశాంతంగా ఉండాలి. గుండెనొప్పి వంటిది వస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

>
మరిన్ని వార్తలు