కరోనా అలర్ట్‌: ఎయిర్‌పోర్టులో పది అంబులెన్స్‌లు

19 Mar, 2020 11:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తితో జనాలు గడప దాటాలంటేనే జంకుతున్నారు. పలు దేశాలు సైతం విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఈ వైరస్‌ భయంతో జనాలు ప్రయాణాలకు మొగ్గు చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఎప్పుడూ ప్రయాణికులతో కిక్కిరిసిపోయే శంషాబాద్‌ విమానాశ్రయం గురువారం నిర్మానుష్యంగా మారింది. అంతేకాక పలు ఎయిర్‌లైన్‌ సర్వీసులు కూడా రద్దవడంతో రాకపోకలు స్థంభించాయి. మరోవైపు విదేశాల నుంచి వస్తున్న వారిని నేరుగా వారి లగేజ్‌తో సహా ఐసోలేషన్‌ వార్డులకు తీసుకెళ్తున్నారు. ఇందుకోసం ఆర్టీసీ బస్సులను, డీసీఎం వ్యానులను ఎయిర్‌పోర్టులో అందుబాటులో ఉంచారు.

విమానాశ్రయంలో పది అంబులెన్స్‌లు
వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను తప్పనిసరి 14 రోజుల క్వారంటైన్‌కు తరలిస్తుండటంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 10 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. విమానాశ్రయంలో ప్రతిరోజు 2 వేల నుంచి 2,500 మంది ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో కరోనా అనుమానిత లక్షణాలు కనిపించిన వారితో పాటు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ఇస్తున్న ప్రయాణికులకు నగరంలోని గాంధీ, ఫీవర్‌ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మిగతావారిని వికారాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. (ఆకాశవీధిలో..నో టూర్స్‌)

విమానాలు భారీగా రద్దు..
కొన్నిరోజులుగా ఆయా దేశాల ఆంక్షలతోపాటు ప్రయాణికులు కూడా రాకపోకలకు రద్దు చేసుకుంటుండటంతో అంతర్జాతీయ ట్రాఫిక్‌తోపాటు దేశీయ ట్రాఫిక్‌ కూడా తగ్గుముఖం పడుతోంది. కోవిడ్‌ ప్రభావంతో బుధవారం నాలుగు అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు 25 దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమానాల్లో ప్రయాణికుల రాకపోకలు తగ్గడంతో పలు ఎయిర్‌లైన్స్‌ సంస్థలు, ఢిల్లీ, కొచ్చిన్‌, బెంగళూరు, చెన్నైలాంటి ప్రధాన నగరాలకు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను రద్దు చేశాయి. (చిరుత అనుకొని.. పరుగులు పెట్టిన ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది)

మరిన్ని వార్తలు