శంషాబాద్‌ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం 

6 Jun, 2020 09:05 IST|Sakshi

ఆసియా పసిఫిక్‌ గ్రీన్‌ ఎయిర్‌పోర్టు అవార్డు

సాక్షి, శంషాబాద్‌: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి(ఆర్‌జీఐఏ) మరో అంతర్జాతీయ పురస్కారం లభించింది. పర్యావరణహితమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఆసియా విభాగంలో ఏటా 15 నుంచి 35 మిలియన్‌ ప్రయాణికుల సామర్థ్యం కలిగిన విమానాశ్రయాల్లో ఆర్‌జీఐఏ 2020 సంవత్సరానికి గాను పసిఫిక్‌ గ్రీన్‌ ఎయిర్‌పోర్టు ప్లాటినం పురస్కారాన్ని దక్కించుకుంది. ఆ పురస్కారాన్ని ఆర్‌జీఐఏకు అంతర్జాతీయ విమానాశ్రయ మండలి ఇటీవల అందజేసింది.

ఆర్‌జీఐఏలో తీసుకుంటున్న పర్యావరణ హితమైన చర్యలు బాగున్నాయని ఏసీఐ డైరెక్టర్‌ స్టెఫానో బారోన్కీ పేర్కొన్నట్లు ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు సీఈఓ ఎస్‌జీకే కిశోర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో నీటి వినియోగాన్ని తగ్గించడం, నీటిని రీసైక్లింగ్‌ ద్వారా వాడుకోవడం, నీటిని ఒడిసిపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం విమానాశ్రయంలో 925 కేఎల్‌డీ సామర్థ్యం కలిగిన ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్‌ డ్రిప్‌ సిస్టం ద్వారా ఆరు లక్షల క్యూబిక్‌ మీటర్ల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్‌ను ఏర్పాటు చేశారు. ఈ నీటి నిర్వహణను ఏసీఐ ఆధ్వర్యంలో గ్రీన్‌ ఎయిర్‌పోర్టు కమిటీ గుర్తించడం హర్షణీయమని ఎయిర్‌ పోర్టు వర్గాలు పేర్కొన్నాయి.  చదవండి: మేయర్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌

మరిన్ని వార్తలు