ఆశలు నెరవేరేనా!

17 Nov, 2018 13:08 IST|Sakshi

మెదక్‌ టికెట్‌పై కాంగ్రెస్‌ నేతల ఆశలు ఇంకా సడలడం లేదు. ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న నాయకుల్లో ఒక్కరికైనా బీ ఫాం దక్కకపోతుందా అనే ఆశతో ఉన్నారు. పొత్తులున్నప్పటికీ మెదక్‌లో స్నేహపూర్వక పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అయితే శనివారం మెదక్‌ సీటుపై స్పష్టత రానుంది. కాంగ్రెస్‌ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితాను శనివారం ప్రకటించనుంది. కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించే జాబితాలో మెదక్‌ స్థానం ఉంటుందని స్థానిక కాంగ్రెస్‌ నేతలు నమ్మకంగా ఉన్నారు. కాంగ్రెస్‌ బీఫాం దక్కుతుందని ఆశావహులంతా వరుసగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.   

సాక్షి, మెదక్‌ : మెదక్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, జిల్లా నాయకుడు మ్యాడం బాలకృష్ణలు కాంగ్రెస్‌ పార్టీ పేరిట నామినేషన్లు వేశారు. శుక్రవారం శశిధర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా మరో నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ బీసీ నేత బట్టి జగపతి కాంగ్రెస్‌ పార్టీ పేరిట నామినేషన్‌ వేశారు. ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న సుప్రభాతరావు, తిరుపతిరెడ్డిలు సైతం శనివారం ఉదయం నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్‌ ఆశావహులంతా నామినేషన్లు వేస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం మెదక్‌ పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో కాంగ్రెస్‌ ఆశావహులు బట్టి జగపతి, సుప్రభాతరావు, తిరుపతిరెడ్డి, బాలకృష్ణ, చంద్రపాల్‌ సమావేశమయ్యారు.

పొత్తులో భాగంగా మెదక్‌ స్థానాన్ని తెలంగాణ జన సమితికి ప్రకటించినప్పటికీ స్నేహపూర్వక పోటీ కోసం అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలని ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. స్నేహపూర్వక పోటీకి అధిష్టానం అంగీకరించి ఆశావహుల్లో ఎవరికి బీఫాం దక్కినా మిగతా వారంతా నామినేషన్లు ఉపసహరించుకుని బీఫాం వచ్చిన నాయకుడి విజయం కోసం పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శనివారం పార్టీ తుది జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో ఆశావహులంతా శుక్రవారం కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతితో సమావేశమయ్యారు.

విజయశాంతి సైతం స్నేహపూర్వక పోటీకోసం కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థుల తుది జాబితా ప్రకటన అనంతరం స్నేహపూర్వక పోటీపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మహాకూటమిలో భాగంగా టీజేఎస్‌కు 8 సీట్లు ఇస్తే 12 స్థానాలను ప్రకటించుకుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ సీరియస్‌గా తీసుకుందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఏకపక్షంగా టీజేఎస్‌ సీట్లు ప్రకటించినందున స్నేహపూర్వక పోటీ అంశాన్ని ఏఐసీసీ పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే టీజేఎస్‌ 8 సీట్లకు అంగీకరించిన పక్షంలో స్నేహపూర్వక పోటీ ఉంటుందా లేదా అన్న శంక కాంగ్రెస్‌ నేతలను కలవరపెడుతోంది. దీంతో ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న నాయకులంతా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఎన్నికల్లో పోటీకి శశిధర్‌రెడ్డి మొగ్గు 
కాంగ్రెస్‌ అధిష్టానం తనకు బీఫాం ఇస్తుందని మాజీ ఎ మ్మెల్యే శశిధర్‌రెడ్డి ధీమాగా ఉన్నారు. ఇది వరకే నామినేషన్‌ వేసిన ఆయన శుక్రవారం స్వతంత్ర అభ్యర్థిగా మ రోసెట్‌ నామినేషన్‌ వేశారు.
 కాంగ్రెస్‌ పార్టీ బీఫాం ఇవ్వ ని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయ న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే స్వతం త్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసినట్లు సమాచా రం. ఇదిలా ఉంటే శశిధర్‌రెడ్డి ఎన్‌సీపీ పార్టీ నుంచి పోటీ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు