గొర్రెలకు ఏదీ బీమా ధీమా..!

14 Feb, 2018 16:07 IST|Sakshi

జిల్లాలో 2,161     జీవాల మృత్యువాత

ఒక్క గొర్రెకూ దక్కని పరిహారం

బీమా కంపెనీకి చేరని నివేదికలు

జిల్లాలో రూ.85.12 లక్షల నష్టం

ఎవరికీ పట్టని     కాపరుల గోడు

ఇతడి పేరు అల్వాల నాగరాజు(40). సిరిసిల్ల పట్టణ శివారులోని మార్కట్‌పల్లెకు చెందిన ఇతను వ్యవసాయం చేసేవాడు. కులవృత్తిగా వచ్చిన గొర్రెలు కాస్తూ జీవనం సాగించాడు. రాష్ట్ర ప్రభుత్వం 75శాతం రాయితీతో గొర్రెలు ఇస్తుందని సంతోషపడ్డాడు. యాదవ సంఘం సమక్షంలో డ్రా తీయగా నాగరాజు పేరు వచ్చింది. గొర్రెల కోసం రూ.31,250 డీడీ కట్టాడు. 20 గొర్రెలు, ఒక పొట్టేలు వస్తుందని ఆశతో కడపకు వెళ్లాడు. 12 గొర్రెలు, 9 పిల్లలు వచ్చాయి. వచ్చిన పదిహేను రోజులకే పుర్రుకొడుతూ ఐదు గొర్రెలు చనిపోయాయి. రూ.4వేలు మందులు వేసినా గొర్రెలు దక్కలేదు. మరో వారం రోజులకు ఆరు చిన్నవి, నాలుగు పెద్దవి కూడా మృత్యువాత పడ్డాయి. ఇక చిన్నాపెద్ద గొర్రెలు అన్నీ కలిపి 11 మిగిలాయి. పది గొర్రెలు చనిపోయి నాలుగు నెలలు అవుతున్నా.. నాగరాజుకు ఒక్క పైసా పరిహారం రాలేదు. ఇది ఒక్క నాగరాజు పరిస్థితే కాదు.. జిల్లాలోని 446 మంది గొర్రెలకాపరుల దుస్థితి ఇదే..

సిరిసిల్ల :  గొర్రెలకాపరులకు 75 శాతం సబ్సిడీతో నేరుగా ఒక్కొక్కరికి 21 గొర్రెలు అందజేసింది. ఒక్కో యూనిట్‌కు రూ.1.25 లక్షలు కాగా ఇందులో 25 శాతం.. అంటే రూ.31250 లబ్ధిదారు చెల్లిస్తే.. రూ.93,750 ప్రభుత్వం భరించింది. గొర్రెలకు బీమా, రవాణా ఖర్చులు సైతం ఇందులోనే ఉండేలా పథకం రూ పొందించారు.  వీటిని బ్యాంకులతో సంబం ధం లేకుండానే నేరుగా పంపిణీ చేశారు. గొర్రెలకాపరులకు ధీమా ఇవ్వాలనే లక్ష్యంతో గొర్రెలకు బీమా చేయించారు. 20 గొర్రెలు, ఒక్క పొట్టేలుకు బీమా కంపెనీకి చెందిన ట్యాగ్స్‌(పోగులు) వేశారు. అన్ని  గొర్రెలకు కలిపి యూని ట్‌గా బీమా ప్రీమియంగా బీమా కంపెనీకి రూ.3,240 చెల్లించారు. ఏడాదిలోగా ఆ యూ నిట్‌లోని ఏ గొర్రె చనిపోయినా రూ.5,200, పొట్టేలు చనిపోతే రూ.7,000 పరిహారంగా గొర్రెలకాపరికి అందించాల్సి ఉంది.

కానీ జిల్లాలోని 446 మంది గొర్రెల కాపరులకు చెందిన 2,161 గొర్రెలు మరణించగా.. ఒక్కరికి కూడా పరిహారం రాలేదు. బీమా..ధీమా దక్కలేదు. జిల్లాలో 2161 గొర్రెలు వివిధ కారణాలతో మరణించగా.. ఇప్పటి వరకు 577 గొర్రెలకు సంబంధించిన బీమా పత్రాలు(డాకెట్స్‌) కంపెనీకి చేరాయి. అందులో 524 గొర్రెలకు బీమా చెల్లిస్తామని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. మరో 53 గొర్రెల డాకెట్స్‌ సరిగా లేవని తిరస్కరించారు. ఇంకా 1,584 గొర్రెల బీమాపత్రాలు సమర్పించలేదు. వాటికి సంబంధించిన ఆనవాళ్లు కరువయ్యాయి. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. గొర్రెలకాపరులకు నష్టం తప్పడం లేదు.

కారణాలేమిటీ..?
ప్రతీగొర్రెను సజీవంగా ఉండగానే ట్యాగ్‌తో సహా ఫొటో తీయాల్సి ఉంటుంది. ఆ గొర్రె చ నిపోయినప్పుడు ఆ సమాచారాన్ని సంబంధిత మండల పశువైద్యాధికారికి సమాచారం అం దించాలి. ఆయన క్షేత్రస్థాయిలో చనిపోయిన గొర్రెను చూసి పోస్టుమార్టం నిర్వహించి మృ తికి గల కారణాలను విశ్లేషిస్తూ.. డాక్టర్‌ నివేదిక ఇవ్వాలి. చనిపోయిన గొర్రెను ట్యాగ్‌ కని పించే విధంగా ఒక్కటి, మొత్తం గొర్రెతో మరో టి, ట్యాగ్‌ నంబరు కనిపించే విధంగా మూడు ఫొటోలు తీయాలి. ఈ ఫొటో ప్రింట్లు, డాక్టర్‌ పోస్టుమార్టం నివేదికతో కలిపి బీమా కంపెనీకి పంపించాల్సి ఉంటుంది. కంపెనీకి అన్ని పత్రాలు సవ్యంగా ఉన్నట్లు చేరితో మూడు నెలల్లో పరిహారం చెక్కు లేదా, డీడీ రూపంలో గొర్రెలకాపరికి బ్యాంకు ఖాతాకు చేరుతుంది. ఈ మొత్తం విధానంపై అవగాహన లేకపోవడంతో చనిపోయిన గొర్రెలను పాత బావుల్లో పడేయడం, లేదా పూడ్చివేశారు. దీంతో ఆనవాళ్లు కనిపించక బీమా కంపెనీలు పరిహారం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. దీనిపై అవగాహన కల్పించాల్సిన పశువైద్యాధికారులు పట్టించుకోవడం లేదు.

జిల్లాలో రూ.85.12 లక్షల నష్టం
జిల్లావ్యాప్తంగా 212 గ్రామాల్లో తొలివిడత 8,153 మందికి 1,71,213 గొర్రెలను పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 6,931 మందికి 1,45,551 గొర్రెలను పంపిణీ చేశారు. దీని కోసం ప్రభుత్వం రూ.64.97 కోట్లు వెచ్చించింది. గొర్రెలకాపరులు వాటా ధనంగా రూ.21.65 కోట్లు చెల్లించాలి. చనిపోయిన గొర్రెల మూలంగా రూ.85.12 లక్షలు నష్టపోయారు. బీమా కంపెనీ నిర్ధారించిన 524 గొర్రెలకు రూ.27.24 లక్షల పరిహారం వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకైతే ఒక్క క్లెయిమ్‌ చెల్లింపులు జరగలేదు.

బీమా పరిహారం ఇప్పిస్తాం

జిల్లాకు సరఫరా అయిన గొర్రెలకు బీమా చేయించాం. చనిపోయిన వాటికి పరిహారం ఇప్పించేందుకు బీమా కంపెనీతో మాట్లాడుతున్నాం. నిర్దేశిత డాకెట్లను పంపిస్తాం. ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలకు ఇక్కడికి వచ్చాక 30,608 గొర్రెల పిల్లలు పుట్టాయి. మనజిల్లా వీటి సంపద పెరిగినట్లే. కాపరులు గొర్రె చనిపోతే వెంటనే సమాచారం ఇవ్వాలి. వారు నష్టపోకుండా పరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్‌ టీవీ రమణమూర్తి, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి

మరిన్ని వార్తలు