‘టెండర్’.. వండర్!

22 Jun, 2014 04:18 IST|Sakshi
‘టెండర్’.. వండర్!

- ముగిసిన మద్యం దుకాణాలకు దరఖాస్తు దాఖలు ప్రక్రియ
- పోటెత్తిన దరఖాస్తులు
- 194 షాపులకు 1922..ప్రభుత్వానికి రూ.4.80కోట్ల ఆదాయం
- 23న లాటరీ ద్వారా షాపుల ఎంపిక

మహబూబ్‌నగర్ క్రైం: 2014-15కోసం మద్యం దుకాణాలను కేటాయించేందుకు గతవారం రోజుల క్రితం జిల్లా గెజిట్ జారీఅయింది. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. జిల్లాలోని 194 మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియ శనివారం నాటితో ముగిసింది. జిల్లావ్యాప్తంగా టెండర్లు వేసేందుకు వ్యాపారులు ఎక్కువసంఖ్యలో తరలొచ్చారు. ప్రక్రియ మొదలైననాటి నుంచి పలువురు టెండర్లను దాఖలు చేయడంలోనే తలమునకలయ్యారు. చివరిరోజు ఎటువంటి ఆటంకం జరగకుండా జాగ్రత్త వహించి దరఖాస్తు ఫారాలను అందించారు.
   
డివిజన్‌ల వారీగా..
మహబూబ్‌నగర్ పట్టణంలో 68 దుకాణాలకు 106, జడ్చర్ల 19, కొడంగల్ 187, షాద్‌నగర్ లో 256 దరఖాస్తులు వచ్చాయి. గద్వాల డివిజన్‌లోని 68 దుకాణాలకు గద్వాలలో 172, నారాయణపేట్‌లో 119, వనపర్తిలో 38, కొత్తకోటలో 84, అలంపూర్‌లో 173, ఆత్మకూర్ 93లో దరఖాస్తులు వచ్చాయి. నాగర్‌కర్నూల్ డివిజన్‌లోని 58 షాపులకు తెల్కపల్లిలో 40, ఆమనగల్లులో 48, నాగర్‌కర్నూల్‌లో 131, కల్వకుర్తిలో 90, కొల్లాపూర్‌లో 128 దుకాణాలకు వ్యాపారస్తులు టెండర్లు వేశారు.
     
అచ్చంపేటలో 125దరఖాస్తు వచ్చాయి. మొత్తంగా రాత్రి 10గంటల వరకు 1922 దరఖాస్తులు వచ్చాయి. అయితే గత 2012-13 సంవత్సరానికి జిల్లావ్యాప్తంగా 184 షాపులకు 1288 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది మాత్రం మద్యం షాపులను దక్కించుకునేందుకు వ్యాపారులు ఉత్సాహం చూపారు.
 
మూడు స్లాబ్‌ల విధానంలో..

జిల్లాలో మూడు స్లాబ్‌ల విధానంలో లెసైన్స్ ఫీజులను నిర్ధారించారు. పదివేల జనాభా ఉన్నచోట రూ.32.50 లక్షలు, 10వేల నుంచి 50 వేల జనాభా ఉన్న ప్రాంతంలో రూ.34 లక్షలు, 50వేల నుంచి 3 లక్షల జనాభా ఉన్నచోట రూ.42 లక్షల ఫీజును నిర్ణయించారు. దరఖాస్తుదారుడు 25వేల నాన్ రిఫండబుల్ చలాన్, లెసైన్స్‌ఫీజుపైన 1/3శాతం ధరావత్తు(ఈఎండీ), డీడీ తీయాలి. అదేవిధంగా ఏ1, ఏ2, ఏ3, ఏ4 ఫారాలను నింపాలి. పూర్తి చేసిన దరఖాస్తులను చలాన్, డీడీ, రెండు కలర్ పాస్‌పోర్టు సైజ్‌ఫొటోలను ఫారాలకు జత పరిచి
టెండర్లను దాఖలుచేశారు.
 
194 షాపులకు టెండర్లుదాఖలు
గతంలో జిల్లాలో 194 షాపులకు టెండర్లు వేసిన వాటిలో 185 మద్యం షాపులకు మాత్రమే వ్యాపారులు టెండర్లు వేశారు. మిగతా 9 షాపులకు ఆయా ప్రాంతాల్లో లాభాసాటిగా లేదని ఇతర కారణాలతో అక్కడ టెండర్ల వేసేందుకు వెనకడుగు వేశారు. ఈ వార్షిక సంవత్సరానికి అధికారులు కచ్చితంగా 194 షాపులకు మద్యం వ్యాపారులను టెండర్లు వేసేలా కృషిచేశారు.
 
రెండేళ్లక్రితం వైన్‌షాపుల కేటాయింపుల్లో తీసుకొచ్చిన కొత్త  నిబంధనలు, ఎంఆర్‌పీ రేట్లకే అమ్మకాలు, లెసైన్స్‌ఫీజుకు ఏడు రెట్ల మొత్తానికి కన్నా ఎక్కవ విలువైన మద్యాన్ని అమ్మితే 13.06శాతం ప్రివిలేజ్‌ఫీజు వంటి నిబంధనలు, మార్జిన్‌లోకోత తదితర అంశలన్నీ ఈసారి కూడా ఉన్నాయి. దీంతో మద్యం దుకాణాదారులు వేరే వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ వ్యాపారంలో దశాబ్దాలుగా ఉన్న వారు మాత్రమే ఈ సారి కూడా దుకాణాలను దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు.
 
23న లాటరీ పద్ధతిన ఎంపిక
దాఖలు ప్రక్రియ ముగియడంతో ఈనెల 23న జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో 194 మద్యం దుకాణాలకు సంబంధించిన టెండర్లను కలెక్టర్ సమక్షంలో లక్కీడ్రా ద్వారా ఎంపికచే యనున్నారు.

మరిన్ని వార్తలు